పసుపులేటి రామారావు మృతి.. చిరంజీవి ఘన నివాళి
టాలీవుడ్ చిత్ర సీమ విషాదంలో మునిగింది. సీనియర్ సినిమా సంపాదకుడు పసుపులేటి రామారావు నేడు (ఫిబ్రవరి 11) మృతి చెందారు. తెలుగు సినీ పరిశ్రమకు సీనియర్ జర్నలిస్టుగా, పీఆర్ఓగా ఎన్నో సేవలందించిన పసుపులేటి రామారావు (70) మృతితో చిత్రసీమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. యూరిన్ ఇన్ఫెక్షన్కి గురైన ఆయన మంగళవారం ఉదయం వనస్థలిపురంలోని ప్రైవేట్ హాస్పిటల్లో మరణించారు.
ఆయన సినీ పరిశ్రమకు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఎంతో మంది హీరోలు, నటులు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి వంటి సీనియర్ హీరో దగ్గరి నుంచి నాని వంటి యంగ్ హీరో వరకు ఆయన మృతిపై స్పందిస్తున్నారు. కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్, కొరటాల శివ సైతం సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.

కేవలం నటీనటులే కాదు నిర్మాణ సంస్థలు, నిర్మాతలు ఇలా సినీ రంగంతో పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరూ పసుపులేటి మృతిపై స్పందిస్తున్నారు. తన రచనలతో, విమర్శలతో సినీ చరిత్రకు అక్షర రూపమిచ్చారని ఆయన సేవలను కొనియాడుతున్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. పసుపులేటి రామారావు గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. రామారావు భార్య వెంకటలక్ష్మి, కుమారుడిని పరామర్శించారు. రామారావు పార్థివ దేహం హైదరాబాద్ ఇందిరానగర్లోని ఇంటికి మధ్యాహ్నం చేరగానే చిరంజీవి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. సినీప్రముఖులు ఎస్.వి. కృష్ణా రెడ్డి, అచ్చిరెడ్డి, బీవీఎస్ఎన్ ప్రసాద్, మాదాల రవి, సి.వి. రెడ్డి తదితరులు కూడా అక్కడికి చేరుకుని రామారావు భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు.


Click it and Unblock the Notifications











