Ayodhya Ram Mandir: అయోధ్యలో సినీ తారలు.. టాలీవుడ్ నుంచి ముగ్గురు స్టార్లు.. ఇంకా ఎవరు వెళ్లారంటే!
అయోధ్య.. శ్రీరాముడు జన్మించిన దివ్య స్థలం. అక్కడ రామ మందిరాన్ని ఏర్పాటు చేయడం కోసం ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అయోధ్యలో కొత్త మందిరాన్ని నిర్మించడంతో పాటు బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయబోతుంది. ఈ మహోన్నత కార్యం జనవరి 22వ తేదీ అంటే ఈరోజే మధ్యాహ్నం 12.20 గంటలకు జరగబోతుంది. మరి ఈ కార్యక్రమానికి సినిమా రంగం నుంచి ఎవరెవరు హాజరు అవుతున్నారో ఈ స్టోరీలో చూద్దాం పదండి!
అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని గతంలో ఎన్నడూ జరగనంత గొప్పగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరగనుంది.

అయోధ్య రామ మందిరంలో జరగబోతున్న బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రభుత్వ, ఆలయ పెద్దలతో పాటు మొత్తం పారిశ్రామిక దిగ్గజాలకు, సినీ ప్రముఖులకు, రాజకీయ నేతలకు, ఉన్నతాధికారులకు, దౌత్యాధికారులకు ఇలా 7 వేల మందిని ఆహ్వానించారు. అందులో రెండు వందల మందికి పైగా సినీ ప్రముఖులకు సైతం ఆహ్వానాలు అందిన విషయం తెలిసిందే.
అయోధ్యలో జరిగే మహోన్నత కార్యక్రమం కోసం అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, మోహన్ లాల్, చిరంజీవి, మాధురి దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, సంజయ్ లీలా భన్సాలీ, ధనూష్, రిషబ్ శెట్టి, రణ్బీర్ కపూర్, ఆలియా భట్, అజయ్ దేవ్గణ్, సన్నీ డియోల్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మోహన్ బాబు, యశ్, శివ్ రాజ్కుమార్ వంటి వాళ్లను పిలిచారు.
అయోధ్యలో జరగబోతున్న గొప్ప కార్యం కోసం ఇప్పటికే అక్కడికి పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు చేరుకున్నారు. వీరిలో చాలా మంది ప్రత్యేక విమానాల్లో రామ జన్మభూమికి పయనమై వెళ్లారు. మరికొందరు స్టార్లు కూడా ముహూర్తం సమయానికి అక్కడకు చేరుకోబోతున్నారు.
అయోధ్య రామ మందిరంలో జరగనున్న బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయోధ్య చేరుకున్నారు. అలాగే, అల్లు అర్జున్, ప్రభాస్ కూడా మరికాసేపట్లో వెళ్లనున్నట్లు తెలిసింది. వీరితో పాటు మరికొందరు కూడా అయోధ్య వెళ్తారని తెలిసింది.


Click it and Unblock the Notifications











