ప్రధాని వీడియో సందేశం.. మద్దతు తెలిపిన మెగాస్టార్
ప్రపంచానికి నిద్ర పట్టకుండా చేస్తోన్న కరోనా వైరస్ భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించింది. దేశం మొత్తం లాక్ డౌన్ పాటిస్తుండగా అక్కడక్కడా కొన్ని సమస్యలు వచ్చి జనాలు రోడ్ల మీదకు వస్తున్నారు. రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే కరోనా బారిన పడ్డ వారి సంఖ్య రెండు వేలకు పైగా దాటేసింది. మరణాల సంఖ్యా పెరగడం ఆందోళనను కలిగిస్తోంది. ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతికి ఓ సందేశాన్ని ఇచ్చాడు.
ప్రజలంతా కరోనాను ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్నారని, లాక్ డౌన్ను మరింత కఠినంగా పాటించాలని కోరాడు. ఈ మేరకు ఏప్రిల్ 5న అందరం కలిసి కరోనా వైరస్ అనే అంధకారాన్ని తరిమికొట్టాలనే పిలుపునిచ్చాడు. 130కోట్ల మంది ప్రజలు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు బంద్ చేసి టార్చ్, మొబైల్ లైట్లు, కొవ్వొత్తులు, దివ్వెలు వెలిగించాలని, తద్వారా తాము ఒంటరి కాదనే సంకల్పాన్ని చాటి చెప్పాలని కోరాడు.

ఈ మేరకు చిరంజీవి స్పందిస్తూ.. మన ప్రియతమ ప్రధాని మోదీ పిలుపును గౌరవిద్దామని, అందరం దీపాలు ముట్టిద్దామంటూ తన పోస్ట్ లో పేర్కొన్నారు. 'కరోనా' చీకట్లను పారద్రోలదామని, దేశం కోసం ఒకరికోసం ఒకరు నిలబడదామని పునరుద్ఘాటిద్దామని ప్రజలకు సూచించారు. ఇంతకు ముందు ప్రధాని ప్రకటించిన జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ నిర్ణయాలను కూడా చిరంజీవి సమర్థించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











