సామాజిక సేవలో చిరంజీవి నవశకం... ఉగాదినాడు మెగాస్టార్ కీలక ప్రకటన
కృషి, పట్టుదల, ప్రతిభ ఉంటే ఎవరైనా ఎంతటి సామాన్యులైనా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని నిరూపించారు మెగాస్టార్ చిరంజీవి. తన కష్టంతో స్టార్గా ఎదిగి.. నాలుగు దశాబ్ధాలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నారు చిరు. 70 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో సమానంగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. సినీరంగానికి అందించిన సేవలకు గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు చిరంజీవి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్తో సత్కరించింది.
తనను ఇంతటి వాడిని చేసిన తెలుగు ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలనే లక్ష్యంతో పాతికేళ్ల క్రితమే చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్లను స్థాపించి ఎంతోమందికి కంటి చూపును అందించి, మరెంతో మంది ప్రాణాలను నిలబెట్టారు మెగాస్టార్. కరోనా సమయంలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఆక్సిజన్ సిలిండర్లు, టాబ్లెట్స్, ఇతర మందులను కరోనా రోగులకు అందించారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు సాయం చేశారు చిరంజీవి. తెలుగు రాష్ట్రాలలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎన్నో సార్లు భారీ విరాళాలు అందించారు మెగాస్టార్. తాజాగా ఉగాదిని పురస్కరించుకుని మరో భారీ సేవా కార్యక్రమాన్ని ఆయన ప్రకటించారు. ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.

బయట ఎంతోమంది నన్ను మెచ్చుకున్నా.. ఇంట్లో వాళ్ల ప్రశంసలు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఎన్టీ రామారావు గారితో నాలుగైదు సినిమాలు చేసే అవకాశం లభించింది, ఆయన గొప్పతనం గురించి తెలుసుకునే అవకాశం నాకు లభించింది. అంతటి మహనీయుడి పేరు మీదున్న నేషనల్ అవార్డ్ నాకు రావడం అనేది చాలా అద్భుతం. ప్రేక్షకుల రెస్పాన్స్ను చూస్తే నాకు ఎక్కడా లేని ఊపు వస్తుంది. 200 అడుగుల ఎత్తు నుంచి బంగీ జంప్ చేసింది కూడా వారి కోసమే. నా కొడుకు కూడా నేను ఎలాంటి సలహాలు ఇవ్వను. నేను ఎలా నడుచుకున్నాను, బిహేవ్ చేశానని అన్నది చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్లు చూశారు. పరోక్షంగానో, ప్రత్యక్షంగానో నన్ను యువ హీరోలు చూస్తూనే ఉంటారు. నన్ను కొన్నివేల మంది వాచ్ చేస్తున్నారని జాగ్రత్తగా ఉంటానని చిరంజీవి తెలిపారు.
తెలుగు ప్రజలు నన్ను ఇంతటి వాడిని చేశారు. మాట వరసకు మీ రుణం తీర్చుకోలేనిది అని సభలో మాట్లాడుతుంటాం. అది మాటల వరకే దానిని ప్రత్యక్షంగా కార్యరూపంలోకి ఎలా తీసుకురావాలి? వాళ్లకు తిరిగి ఏం ఇవ్వాలి? సమయానికి రక్తం దొరక్క ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.. డెలివరి సమయంలో ఆడబిడ్డలు, క్యాన్సర్ పేషెంట్స్, యాక్సిడెంట్స్ అయినవాళ్లని చూశా. రక్తం కొరత వలన ప్రాణాలు పోవడం ఏంటీ? ఇంతమంది ప్రజలు ఉండి, వారిలో సరైన అవగాహన లేక, బ్లడ్ ఇవ్వడం లేదని తెలిసింది. రక్తం ఒక మనిషి నుంచి మరో మనిషికి ఇవ్వాల్సిందే తప్పించి ఏ ల్యాబ్లోనూ తీసుకురాలేం. నాకు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు.. థియేటర్లో కేకలు, ఈలలు మాదిరిగా కాకుండా వారిని మోటివేట్ చేయాలన్న ఉద్దేశంతో 25 ఏళ్ల క్రితం నాకొచ్చిన ఆలోచనే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ అని చిరంజీవి పేర్కొన్నారు.
వాటితోనే నేను ఆగిపోకూడదు.. ప్రొఫెషనల్గా కొనసాగకపోయుంటే నేను సేవా కార్యక్రమాలు ఆపేసేవాడినేమో. కానీ నన్ను ప్రజలు ఇంకా ఆదరించడం, విజయాలు నాకు ఇవ్వడం గానీ చూసి సేవా కార్యక్రమాలను మరింత పెంచాలని అనుకుంటున్నా. భవిష్యత్తులో పేద ప్రజలకు విద్యను ఎలా అందించాలి అనేది ప్లాన్ చేస్తున్నా. ఒక వ్యక్తి విద్యావంతుడైతే ఆ కుటుంబం బాగుపడుతుంది. దానికి నటుడు సూర్య నాకు ఇన్స్పిరేషన్. ఆయన ఆగరం అని ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టడానికి చిరంజీవి స్పూర్తి అని పలు సందర్భాలలో చెబుతుండేవారు. సూర్య చేస్తున్న విద్యాదానం అనేది నన్ను ఎంతగానో ఆలోచింపజేసింది. ఒకప్పుడు నేను నీకు ఇన్స్పిరేషన్.. ఇప్పుడు నువ్వు నాకు ఇన్స్పిరేషన్ అయ్యావు. నువ్వు చేస్తున్న కార్యక్రమాల్ని మోడల్గా తీసుకుని తెలుగు ప్రజలతో పాటు దేశంలోని పేద ప్రజలకు ఎడ్యుకేషన్ ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పానని చిరంజీవి వెల్లడించారు. ప్రస్తుతం మెగాస్టార్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. చిరంజీవి తలపెట్టిన సేవా కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది చూడాలి.


Click it and Unblock the Notifications

















