మోహన్ బాబుకు చిరంజీవి మాట సాయం: అందరినీ పరిచయం చేస్తారట
దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో రకాల పాత్రలను చేసిన ఆయన.. చాలా రోజులుగా లీడ్ రోల్స్ మీద దృష్టి సారించడం లేదు. ఈ పరిస్థితుల్లో చాలా గ్యాప్ తర్వాత ఆయన ఇప్పుడు హీరోగా ఓ మూవీ చేస్తున్నారు. అదే 'సన్ ఆఫ్ ఇండియా'. సెటైరికల్గా రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇటీవల విడుదలైన టీజర్కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ గురించి ఓ న్యూస్ వైరల్ తెగ అవుతోంది.
టాలీవుడ్లో మంచి రచయితగా గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మారి తెరకెక్కిస్తోన్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. ఇందులో మోహన్ బాబు లీడ్ రోల్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్లో మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు కూడా ఆయన మాట సహాయం చేస్తున్నారట. మూవీలో వచ్చే అన్ని పాత్రలనూ చిరు పరిచయం చేయబోతున్నారట. దీనికి సంబంధించిన డబ్బింగ్ పనులు త్వరలోనే పూర్తి చేయనున్నారట ఈ స్టార్ హీరో. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో మోహన్ బాబు ఎన్నో గెటప్లలో కనిపిస్తున్నారు. అంతేకాదు, ఒకప్పుడు ఆయన హీరోగా చేసిన రోజులను గుర్తు చేసేదిగా దర్శనమిచ్చారు. ఇందులో శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్పై మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. మేస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తైంది.


Click it and Unblock the Notifications











