సైరా కోసం 'చిరు' ప్రయత్నం.. ఢిల్లీ చేరిన చిరంజీవి.. మోదీ, అమిత్ షా లతో మీట్..!
మెగాస్టార్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'సైరా నరసింహా రెడ్డి'ని దేశ, రాష్ట్ర రాజకీయ ప్రముఖులకు చూపించాలనే కృత నిశ్చయంతో ఉన్నారు చిరంజీవి. ఈ మేరకు నేరుగా సదరు రాజీకయ వేత్తలను కలసి సైరా గురించి వివరిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటగా తెలంగాణ గవర్నర్ తమిళ సై ని కలిసిన చిరంజీవి, ఆ తరువాత సతీసమేతంగా వెళ్లి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడం జరిగింది.
తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చారిత్రాక సినిమా 'సైరా నరసింహా రెడ్డి' చూడాలని తెలంగాణ గవర్నర్ తమిళ సై, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చిరంజీవి కోరారు. ఆయన కోరిక మేరకు సైరా చూసిన ఆ ఇద్దరూ చిరంజీవిపై, సైరా యూనిట్ పై ప్రశంసలు గుప్పించారు. ఈ బాట లోనే దేశ ప్రధాని నరేంద్ర మోడీని, హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు సిద్ధమయ్యారు చిరంజీవి.

ఈ మేరకు ఎంపీ సీఎం రమేష్తో కలిసి చిరంజీవి ఢిల్లీ చేరుకున్నారు. తొలుత ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసి 'సైరా' సినిమా చూడాల్సిందిగా కోరనున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి 'సైరా నరసింహా రెడ్డి' సినిమా విశేషాలు పంచుకోనున్నారు చిరు. సైరా చూడాల్సిందిగా వారిరువురినీ కోరనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి 'సైరా నరసింహా రెడ్డి' సినిమాను చిరంజీవి వీక్షించనున్నారని తెలిసింది. కొన్నాళ్లుగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న చిరు.. ఇలా వరుసగా సీఎం, పీఎం లను కలుస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.


Click it and Unblock the Notifications











