ఆర్థికంగా ఇబ్బంది... నా సినిమా షూటింగ్ను వాయిదా వేస్తున్నాం.. చిరంజీవి
ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి కారణంగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొన్న నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి స్వాగతించారు. కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడుగా ప్రజా సహకారం అవసరం అని మాజీ కేంద్రమంత్రి మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది, మరింత అప్రమత్తత అవసరమన్నారు.

సినిమా హాల్స్, మాల్స్ మూసివేస్తూ తెలుగు రాష్ట్రాల ప్రకటన తర్వాత చిరంజీవి స్పందిస్తూ.. కరోనా మహమ్మారి నియంత్రణ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న ద్విముఖ వ్యూహం: కరోనా సోకిన వారికి తగిన చికిత్స అందించడం, వైరస్ వ్యాప్తి కాకుండా జనాలు గుమికూడకుండా క్రీడల్ని వాయిదా వేయడం, మాల్స్, సినిమా హాల్స్ ని మూసివేయడం, స్కూల్స్, కళాశాలలకు సెలవులు ప్రకటించడం తదితర చర్యలు తీసుకోవడం ముదావహం. కరోనా నియంత్రణ బాధ్యత ప్రభుత్వాలకే వదిలివేయకుండా అందరూ భాగస్వామ్యులు కావాలి. అందరిలో చైతన్యం కలిగించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచే విధంగా చర్యలు తీస్కుంటున్నందుకు ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని ముందస్తు నివారణా చర్యలు ప్రారంభించినట్టు తెలుసుకున్నా. పరిస్థితులకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నాను. కాగా సినిమా షూటింగ్స్ లో కూడా పెద్ద సంఖ్యలో సాంకేతిక నిపుణులు పనిచేయాల్సి ఉంది. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 10 నుంచి 15 రోజుల పాటు షూటింగ్స్ వాయిదావేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను.
ప్రస్తుతం చిత్రీకరణ కొనసాగుతోన్న నా సినిమా షూటింగ్ని వాయిదా వేద్దామని దర్శకుడు కొరటాల శివ తో చెప్పినప్పుడు ఆయన వెంటనే అంగీకరించారు. ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదు కనుక ఆర్థికంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నప్పటికీ కరోనా వైరస్ ని నియంత్రణ చేసే ఉద్యమంలో సినీరంగం కూడా పాలు పంచుకోవాలని కోరుతున్నాను, అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను అని మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రకటనలో తెలిపారు.


Click it and Unblock the Notifications











