కమిటీ కుర్రోళ్లోని తొక్కేయాలని చూస్తున్నారు : హీరో సంచలన వ్యాఖ్యలు
కరోనా తర్వాతి నుంచి ప్రేక్షకులు సినిమా చూసే విధానం పూర్తిగా మారిపోయింది. ఆ టైంలో ఓటీటీల ద్వారా ప్రపంచంలోని అన్ని భాషల చిత్రాలు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆ కంటెంట్తో మన సినిమాలను పోల్చి చూస్తున్నారు. తేడా కొట్టిందా.. ఎంత పెద్ద స్టార్ నటించినా, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా ఎలాంటి కనికరం లేకుండా సినిమాను తొక్కేస్తున్నారు ప్రేక్షకులు . కథాబలం ఉంటే మాత్రం అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని చూడటం లేదు.. కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. మేకర్స్ కూడా ఈ విషయాన్ని గ్రహించి ఒళ్లు దగ్గరపెట్టుకుని సినిమాలు తీస్తున్నారు.
కథ, కంటెంట్ పరంగా చిన్న సినిమాలే నయం అనిపించుకుంటున్నాయి. భారీ స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం, నిర్మాతల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందడంతో దర్శకుడు స్వేచ్ఛగా పనిచేసుకుంటూ.. తను చెప్పాలనుకున్న విషయాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు. కొత్త నటీనటులు కూడా కెరీర్లో నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో ప్రాణం పెట్టి నటిస్తుండటంతో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ .. టాలీవుడ్ పరువు కాపాడుతున్నాయి.

తాజాగా మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారి రూపొందించిన కమిటీ కుర్రోళ్లు సినిమా ఘన విజయం సాధించింది. యదు వంశీ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా.. అంతా కొత్తవాళ్లు నటించారు. ఆగస్ట్ 9న రిలీజైన కమిటీ కుర్రోళ్లు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. పల్లెటూరి వాతావరణంలో స్నేహం, ప్రేమ, కుటుంబ బంధాలను ఈ మూవీ అద్భుతంగా ప్రెజెంట్ చేసింది. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, హీరోయిన్స్ను నిహారిక తెలుగు తెరకు పరిచయం చేసింది.
ఆగస్ట్ 15న మిస్టర్ బచ్చన్, తంగలాన్, డబుల్ ఇస్మార్ట్ వంటి బడా సినిమాలు రిలీజ్ కావడంతో కమిటీ కుర్రోళ్లు సైడ్ అవుతుందని అంతా భావించారు. అయితే ఆ చిత్రాలకు డివైడ్ టాక్ రావడంతో కమిటీ కుర్రోళ్లు మళ్లీ పుంజుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మధ్యలో పెద్ద సినిమాలు లేకపోవడం.. సెలవుల సీజన్ కావడంతో లాంగ్ రన్లో ఈ మూవీ మంచి కలెక్షన్లు దక్కించుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే కమిటీ కుర్రోళ్లు సినిమాను తొక్కేయడానికి కొందరు డిస్ట్రిబ్యూటర్లు ప్రయత్నిస్తున్నారంటూ ఇందులో హీరోగా నటించిన యశ్వంత్ పెండ్యాల సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఏరియాల్లో సినిమా ఆడటం లేదని, ఆ సంగతి చూడాలంటూ కొందరు తమకు వందలాది ఫోన్ చేస్తున్నారని చెప్పారు. సినిమా బాగున్నప్పుడు స్క్రీన్ల సంఖ్యను పెంచాలని.. ఆగస్ట్ 15న వేరే సినిమాలు రిలీజైనా కమిటీ కుర్రోళ్లు థియేటర్లు హౌస్ఫుల్స్ అవుతున్నాయని యశ్వంత్ తెలిపారు. తమ థియేటర్స్ తమకు ఉన్నాయని.. కానీ రెస్పాన్స్ నేపథ్యంలో స్క్రీన్లను, షోలను పెంచితే బాగుంటుందని ఆయన డిస్ట్రిబ్యూటర్లను కోరారు. ప్రస్తుతం యశ్వంత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











