నిన్న చప్పట్లు.. నేడు అసహనం.. సైన్యాన్ని రంగంలోకి దించాల్సిందే.. వర్మ
కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటిస్తే.. పౌరులు పెద్దగా స్పందించకపోవడంపై రాంగోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. విపత్కర పరిస్థితుల్లో కనీస బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు. పౌరుల భాద్యతారాహిత్యంపై స్పందిస్తూ..
కరోనావైరస్ కట్టడి చేయడానికి ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటిస్తే.. జనం రోడ్లపైకి వచ్చి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఆదివారం జనతా కర్ప్యూ కేవలం వన్డే ఇంటర్నేషనల్ మాదిరిగా ఒకరోజు సంఘీభావం మాదిరిగానే కనిపించింది. ఇలాంటి కొవీడియెట్స్ దారికి రావాలంటే సైన్యాన్ని పెట్టి గట్టిగా బుద్ది చెప్పాల్సిందే అంటూ వర్మ ట్వీట్ చేశారు.
ఆదివారం 5 గంటలకు చప్పట్లు కొడుతూ పోలీసులకు, డాక్టర్లకు, మీడియాకు, అత్యవసర సేవల విభాగాలకు సంఘీభావం ప్రకటించారు. ఈ రోజు ఉదయం 5 గంటలకే వాటిని పట్టించుకోకుండా రోడ్లమీద తిరుగుతున్నారు. భారతీయుల సంఘీభావం గొప్పగా ఉందని చెప్పడానికి ఇదో నిదర్శనం అంటూ వర్మ సెటైర్లు వేశారు.

ఇటీవల కాలంలో కరోనావైరస్ గురించి పలు విషయాలపై వర్మ స్పందిస్తుండటం గమనార్హం. కొన్నిసార్లు అధికారులపై, మరికొన్న సార్లు ప్రభుత్వాలపై..అలా పౌరులపై తనదైన శైలిలో ట్విట్లతో విమర్శలు సంధిస్తూ ఆకట్టుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











