సెన్సార్ బోర్డుపై టాలీవుడ్ ప్రొడ్యూసర్ అసహనం.. ప్రధాని మోడీని కలుస్తానంటూ!
వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన రొమాంటిక్ ఎంటర్టైనర్ కపుల్ ఫ్రెండ్లీ (Couple Friendly). ప్రస్తుతం పాజిటివ్ టాక్తో థియేటర్లలో నడుస్తోంది. యంగ్ హీరో సంతోష్ శోభన్(Santosh Shobhan), మానస వారణాసి(Manasa Varanasi) జంటగా నటించారు. ఈ సినిమాకు అశ్విన్ చంద్రశేఖర్(Ashwin Chandrasekhar) దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని నిర్మించారు. సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదని మూవీ మేకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనికి ప్రధాన కారణం సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఇచ్చిన 'A' సర్టిఫికెట్ అని నిర్మాత ధీరజ్ మొగిలినేని ఆరోపిస్తున్నారు.
మీడియాతో మాట్లాడిన ధీరజ్ మొగిలినేని భావోద్వేగంగా స్పందించారు. 'ఈరోజు శివరాత్రి పండుగ. కుటుంబాలతో కలిసి సినిమాలు చూసే రోజు. కానీ 'A' సర్టిఫికెట్ వల్ల పిల్లలతో థియేటర్లకు రావాల్సిన ప్రేక్షకులు వెనక్కి తగ్గుతున్నారు. సినిమాకు ఎంత అప్రిసియేషన్ వచ్చినా, నిర్మాతగా మాకు రావాల్సిన రెవెన్యూ రావడం లేదు' అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

కేవలం తమ సినిమాకే కాదు... ఈ ఏడాది ఇప్పటికే దాదాపు ఐదు చిత్రాలు ఇలాంటి సర్టిఫికేషన్ సమస్యను ఎదుర్కొన్నాయని ఆయన గుర్తుచేశారు. ఈ వ్యవహారంపై టాలీవుడ్ పెద్దలను సంప్రదించామని, ముఖ్యంగా నిర్మాత దిల్ రాజు ను కలిసినా, 'సెన్సార్ నిర్ణయాలు ముంబై నుంచి వస్తాయి... మన చేతుల్లో ఏమీ లేదు' అనే సమాధానం వచ్చిందని చెప్పారు.
అవసరమైతే ప్రధాని మోదీ దగ్గరకైనా వెళ్తా
ఈ విషయంలో మరింత ఘాటుగా స్పందించిన ధీరజ్.. 'మాకు న్యాయం జరగకపోతే అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) దగ్గరకైనా వెళ్లి మా బాధ చెప్పుకుంటా. ఇది ఒక్క మా సినిమాకే కాదు... ఈ ఒక్క సంవత్సరంలోనే చాలా సినిమాలు ఇదే సమస్యను ఎదుర్కొన్నాయి' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ ప్రశంసలు... అయినా కలెక్షన్లపై ప్రభావం
ఈ సినిమాపై రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ప్రశంసలు కురిపించడం విశేషం. 'నాకు వర్షం సినిమా లాగా సంతోష్ శోభన్కు ఈ సినిమా నిలిచిపోతుంది' అంటూ ప్రభాస్ చెప్పిన మాటలు అభిమానుల్లో ఉత్సాహం నింపాయి. అయినప్పటికీ, A సర్టిఫికెట్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గడంతో కలెక్షన్లు ఆశించినంతగా రావడం లేదని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.
అలాగే.. ఇటీవల జరిగిన సక్సెస్ మీట్లో ధీరజ్ మొగిలినేని మరోసారి స్పందించారు. గతంలో 'సినిమా నచ్చకపోతే మళ్లీ మైక్ పట్టుకోను'అంటూ చేసిన వ్యాఖ్యలపై కూడా క్లారిటీ ఇచ్చారు. 'ఆ రోజు కాన్ఫిడెన్స్లో ఫ్లోలో చెప్పేశా. పబ్లిసిటీ కోసం అన్నానని కొందరు విమర్శించారు. కానీ ఈరోజు మంచి సినిమా ఇచ్చామని ఆడియన్స్ స్పందన చూస్తే సంతృప్తిగా ఉంది. ఇకపై ఇంకా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నా'అని తెలిపారు.
రెండేళ్ల బ్రేక్ తర్వాత సంతోష్ శోభన్ సరైన కథతో తిరిగొచ్చారని ప్రేక్షకులు చెబుతున్నారు. ఫన్ సీన్స్లో టైమింగ్, ఎమోషనల్ సీన్స్లో మెచ్యూరిటీతో ఆయన ఆకట్టుకున్నారు. మానస వారణాసి కూడా తన పాత్రలో ఒదిగిపోయారు. రియల్ లొకేషన్లలో తెరకెక్కించిన సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్గా నిలిచింది. కొత్త దర్శకుడైనా అశ్విన్ చంద్రశేఖర్ ప్రేమకథను సున్నితంగా చూపించగలిగారు. అయితే.. 'కపుల్ ఫ్రెండ్లీ' యూత్తో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా అలరించే క్లీన్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్రశంసలు అందుకుంటోంది. కానీ సెన్సార్ ఇచ్చిన 'A' సర్టిఫికెట్ వల్లే సినిమా వాణిజ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని నిర్మాతలు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











