మరో ఐబొమ్మ రవిని పుట్టిస్తారా... Akhanda 2 టికెట్ ధరలు పెంపుపై సీపీఐ నారాయణ ఫైర్
పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజ్ అయ్యే సమయంలో తమ పెట్టుబడిని వారం రోజుల్లో వెనక్కి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో నిర్మాతలు ప్రభుత్వాలను అభ్యర్ధించి టికెట్ ధరలు పెంచుకుంటున్నారు. గత కొద్దికాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ సంస్కృతి బాగా పెరిగింది. చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు.. నిర్మాతలు అడగటమే ఆలస్యం కాదనకుండా రేట్లు పెంచడానికి అనుమతులు ఇచ్చేస్తున్నాయి.
టికెట్ ధరలే కాదు.. బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు, అదనపు షోలు ప్రదర్శించుకోవడానికి కూడా పర్మిషన్ ఇస్తున్నాయి. దాంతో టికెట్ ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాల తీరుపై మేధావులు, రాజకీయ పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. తాజాగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించడం వివాదాస్పదమైంది.

అఖండ 2 టికెట్ ధరల పెంపుకు ఏపీ సర్కార్ అనుమతి
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ 2 చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీని ప్రకారం.. సింగిల్ స్క్రీన్లలో 75 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 100 రూపాయలు పెంచుకునేందుకు అనుమతించింది. రోజుకు ఐదు షోలతో పాటు దాదాపు 10 రోజుల పాటు పెంచిన ధరలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. అలాగే రిలీజ్కు ముందు రోజు రాత్రి (డిసెంబర్ 4) 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్ షో ప్రదర్శించడానికి కూడా అనుమతించింది. ఈ ప్రీమియర్ షో ధరను 600గా నిర్ణయించారు.
ఐ బొమ్మ రవిలాంటి వాళ్లు పుడుతూనే ఉంటారు
అయితే అఖండ 2కు టికెట్ ధరలను పెంచడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. తాజాగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సైతం దీనిపై మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పుడే చూశాను.. అఖండ 2కి సినిమా రేట్లు పెంచుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ప్రకటనలే కదా.. ఐ బొమ్మ రవి లాంటి వారు పుట్టేది. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసేవాళ్లు.. ఆ డబ్బుని ప్రజల మీద భారం వేసేందుకు ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం. కాబట్టే ఈ కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడటానికి ప్రజానీకం ఐబొమ్మ రవిలాంటి వారు చేసిన సినిమాను చూస్తున్నారు. మీరే సృష్టిస్తున్నారు.. అతనిని అరెస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడుంది? మీ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు అని సీపీఐ నారాయణ ప్రశ్నించారు.
సినిమాను ప్రజలకు దూరం చేయొద్దు
ఆయనను జైళ్లో పెడితే.. అలాంటి వాళ్లు ఇంకా ఎంతోమంది వస్తారు. ఇలాంటి సినిమాలకు రేట్లు పెంచి, దివాళాకోరుతనంలా సంపన్నులకు ఊడిగం చేస్తూ.. సామాన్య ప్రజానీకం దగ్గర జేబులు కొట్టేస్తూ, వాళ్లకి తిరుక్షవరం చేస్తున్నారు. త్వరలో ఆరు, ఏడు సినిమాలు రాబోతున్నాయి. వాటి రేట్లును కూడా పెంచుతూ ప్రజలపై భారం వేస్తుంటే ఐబొమ్మ రవిలాంటి వారు చాలామంది పుడతారు. వాళ్లను ఆపడం మీకు చేతకాదు.. ఇది మీ స్వయంకృతాపరాధం. వ్యవస్థతో చేస్తున్న అనేక అరాచకాల మాదిరిగానే ఇది. తగిన చర్యలు తీసుకోకపోతే.. ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. సినిమాను ప్రజలకి దూరం చేయొద్దు.. సినిమా థియేటర్లకే ప్రజలు దూరంగా వచ్చేస్తున్నారు. సినిమా థియేటర్లలో వంద రోజులు 50 రోజులు ఆడుతూ ఉంటే సామాన్య ప్రజలు చూస్తారు. కళామ్మతల్లిని ప్రజలకు దూరం చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకర ధోరణి.. ఇలాంటి విలాసవంతమైన సినిమాలు తీసి వాళ్లకు నష్టం వస్తుందనే భయంతో, ప్రజల మీద భారం వేస్తే ఇది ప్రజలు ఊరుకోరు. మేం తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ నారాయణ హెచ్చరించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అఖండ 2 యూనిట్ ఈ వ్యవహరంపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











