పోలీసుల అదుపులో దాసరి కుమారుడు.. ఎట్టకేలకూ ఆచూకీ లభ్యం!
ప్రముఖ దర్శకుడు, స్వర్గీయ దాసరి నారాయణరావు కుమారుడు ప్రభు ఆచూకీ లభ్యమైంది. గత కొద్ది రోజులుగా ఆయన కనిపించడం లేదనే విషయంపై హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. అయితే బుధవారం ప్రభు తన నివాసానికి చేరుకోవడంతో కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ప్రభు ఆచూకీ మిస్టరీగా మారడంతో పోలీసులు, దర్యాప్తు బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రభు ఆచూకీ లేదంటూ నమోదైన కేసు వివరాల్లోకి వెళితే.. తన అల్లుడు ప్రభు కనిపించడం లేదంటూ, ఆయన మామ నార్ల సురేంద్ర ప్రసాద్ కొద్దిరోజల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
జూన్ 9వ తేదీన జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46లోని ఆఫీసులో పనులు చూసుకున్న అనంతరం ప్రభు తన కార్యాలయ సిబ్బందికి చెప్పి ఆటోలో బయటకు వెళ్లాడు. అదే రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో భార్య పద్మావతి ఫోన్ చేసినా స్పందించలేదు. పోలీసుల దర్యాప్తులో సీసీ టీవీ ఫుటేజ్ఆధారంగా ప్రభు ఎంజీబీఎస్లో చిత్తూరు బస్ ఎక్కినట్టు తెలిసింది. ఆటో డ్రైవర్ ఫోన్ నుంచే ప్రభు తన బస్సు ప్రయాణానికి సంబంధించిన టికెట్ బుక్ చేసుకున్నాడని విచారణలో తెలిసింది.

అయితే చిత్తూరులో ఉండే తన రెండో భార్య వద్దకు వెళ్లి ఉంటాడా అనే అనుమానంతో పోలీసులు ఓ బృందాన్ని పంపారు. అయితే అక్కడ ఆచూకీ లభ్యం కాకపోవడంతో మళ్లీ ఉత్కంఠ పెరిగింది. అనూహ్యమైన పరిణామాల మధ్య ప్రభు హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్నాడు. దాంతో బంజారా హిల్స్ పోలీసులు ప్రభును అదుపులోకి తీసుకొన్నారు. ప్రస్తుతం ఎవరికి కనిపించకుండా ఎక్కడికి వెళ్లారు? ఏ కారణంగా అదృశ్యమయ్యారనే అంశాలపై ఆయనను పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











