‘డియర్ కామ్రేడ్’ నుంచి ఆ సీన్లు లేపేశారు.. కలెక్షన్లు పరుగు పెడతాయా?
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రూపొందిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ జులై 26న సౌతిండియాలోని 4 భాషల్లో విడుదలైంది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.
సినిమా నిడివి ఎక్కువగా ఉండటం, సెకండాఫ్లో బాగా సాగదీశారనే విమర్శలు రావడంతో వెంటనే.... దర్శక నిర్మాతలు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. సినిమాలో చెత్త అనుకున్న సీన్లను లేపేశారు. దీంతో 13 నిమిషాలు కుదించబడింది. ఇప్పుడంతా శాటిలైటే కాబట్టి ఆదివారం నుంచే ట్రిమ్డ్ వెర్షన్ ప్రదర్శించడం మొదలు పెట్టారు.

రిలీజ్ ముందు నుంచే భారీ హైప్ ఉండటంతో 'డియర్ కామ్రేడ్' ఓపెనింగ్స్ అదిరిపోయాయి. అయితే రిలీజ్ తర్వాత మౌత్ టాక్ యావరేజ్ అనే విధంగా రావడంతో ఫస్ట్ వీకెండ్ వసూళ్లు అనుకున్న స్థాయిలో రాలేదు. మరి ఇప్పుడు ట్రిమ్ చేశారు కాబట్టి కలెక్షన్లు ఏ మేరకు పుంజుకుంటాయో చూడాలి.
ఓవర్సీస్ ఏరియాలో ఈ చిత్రానికి మంచి స్పందన ఉంది. ప్రీమియర్ షోల ద్వారా $310,824 గ్రాస్ రాబట్టింది. శనివారం నాటికే $510,935 రీచ్ అయింది. ఫస్ట్ వీకెండ్ $650K వసూలు చేసింది. నైజాంలో కూడా వస్లూ ఫర్వాలేదు. ఇక్కడ తొలివారాంతం రూ. 5.68 కోట్లు రాబట్టింది.
భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్నాటకలో ఆయా భాషల్లో రిలీజ్ చేశారు.


Click it and Unblock the Notifications











