డ్రగ్ కేసు విచారణకు హాజరైన దీపిక పదుకోన్.. రెండు రౌండ్లపాటు విచారణ
బాలీవుడ్లో డ్రగ్స్ రాకెట్ సంబంధాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపిక పదుకోన్ శనివారం (సెప్టెంబర్ 26) ఎన్సీబీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో దక్షిణ ముంబైలోని కొలాబా ఎన్సీబీ సిట్ గెస్ట్హౌస్కు చేరుకొన్నారు. ఆమె MH01 DB 1482 వాహనంలో ఎన్సీబీ కార్యాలయానికి చేరుకొంటూ మీడియా కంటపడ్డారు.
విచారణలో భాగంగా దీపికను ఎన్సీబీ అధికారులు రెండు రౌండ్లపాటు ప్రశ్నించనున్నారు. ఎన్సీబీ విచారణకు హాజరైన ఆమెకు పలు ప్రశ్నలతో కూడిన జాబితాను అందజేయగా అందులోనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా డ్రగ్స్ కోసం ప్రత్యేకంగా దీపికతోపాటు పలువురు సెలబ్రిటీలు ఓ వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసుకొన్నాయనే విషయం బయటకు వచ్చింది. ఆ గ్రూప్ పేరు DP+KA+KWAN అని నామకరణం చేసుకొన్నారు. ఈ గ్రూప్ ద్వారానే డ్రగ్స్ కొనుగోలు, సమకూర్చుకోవడం, వినియోగం లాంటివి చేస్తుంటారు అనే విషయాన్ని రిపబ్లిక్ టెలివిజన్ తన కథనంలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కూడా దీపికను ప్రశ్నించే అవకాశం ఉంది.
విచారణలో కరిష్మా ప్రకాశ్, జయ సాహా వెల్లడించిన విషయాలను ప్రస్తావించగా వాటిని దీపిక పదుకోన్ తోసిపుచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో డ్రగ్స్ వాడకం, సమకూర్చుకోవడం లాంటి విషయాలపై ఆమెను సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో దీపికతోపాటు సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూర్ను కూడా విచారిస్తారు. ఈ కేసులో దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్ను కూడా రెండోసారి విచారించనున్నారు.


Click it and Unblock the Notifications











