Dhanush Aishwarya Divorce : ధనుష్ - ఐశ్వర్య విడాకులు .. పిల్లలు ఎవరి దగ్గరికంటే?
భారతదేశంలో వివాహానికి, వైవాహిక వ్యవస్ధకు ఎంతో ప్రాధాన్యత ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచం మొత్తం భారతీయ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను గౌరవిస్తుంది. అలాంటి భారతీయ వైవాహిక వ్యవస్ధకు ప్రస్తుతం బీటలు వారే పరిస్ధితి నెలకొంది. ప్రస్తుతం మనదేశంలో విడాకుల కల్చర్ పెరుగుతోంది. ఒకరిని చూసి మరొకరు డైవర్స్ తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఎంతో బాధ్యతగా ఉండాల్సిన సెలబ్రెటీలు ఒకరి తర్వాత మరొకరు విడాకులు తీసుకుంటున్నారు.
కోలీవుడ్లో ధనుష్ - ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల వ్యవహారం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. సూపర్స్టార్ రజనీకాంత్ గారాలపట్టి అయిన ఐశ్వర్య .. 2004లో ధనుష్ని ప్రేమించి పెళ్లాడారు. ఈ దంపతులకు యాత్ర, లింగ అని ఇద్దరు పిల్లలు. దాదాపు 18 సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా జీవించిన ఈ జంట 2022లో షాకిచ్చారు. తామిద్దరం విడిపోతున్నట్లుగా వేర్వేరుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. నాటి నుంచి ఇద్దరూ విడి విడిగానే ఉంటున్నారు.. పిల్లలతో కలిసి తన తండ్రి రజనీకాంత్ ఇంట్లో ఐశ్వర్య ఉండగా.. ధనుష్ తన ఇంట్లోనే ఉంటున్నారు.

ధనుష్ - ఐశ్వర్యల విడాకుల కేసుపై గత గురువారం చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో విచారణకు వచ్చింది. ఆ సమయంలో తాము కలిసి జీవించాలని అనుకోవడం లేదని, తమకు విడాకులు మంజూరు చేయాలని వారిద్దరూ కోర్టుకు తేల్చిచెప్పారు. న్యాయస్థానం నుంచి బయటికొస్తున్న వీరిద్దరిని విలేకరులు కదిపే ప్రయత్నం చేయగా ఇద్దరూ మౌనంగా వెళ్లిపోయారు. ప్రస్తుతం ధనుష్ టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కుబేర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలకపాత్ర పోషిస్తుండగా.. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు.
ఇక ఐశ్వర్య విషయానికి వస్తే.. ప్రస్తుతం తన తండ్రి రజనీకాంత్ హీరోగా నటిస్తున్న లాల్ సలామ్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ సినిమా షూటింగ్ అయిపోయినట్లుగా వార్తలు రాగా.. మళ్లీ తిరిగి పట్టాలెక్కినట్లుగా తెలుస్తోంది. గతంలో తన భర్త ధనుష్ హీరోగా నటించిన 3 అనే సినిమాని డైరెక్ట్ చేసిన ఐశ్వర్య తనలోని ప్రతిభను చాటుకున్నారు. శృతి హాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ కాగా.. ఇందులో ధనుష్ ఆలపించిన వై దిస్ కొలవెరి సాంగ్ బ్లాక్బస్టర్గా నిలిచింది.

ఈ సంగతి పక్కనబెడితే.. ధనుష్ - ఐశ్వర్యల పిల్లలు యాత్ర, లింగల భవిష్యత్తు ఏంటీ? కోర్టు వారి బాధ్యతను ఎవరి చేతుల్లో పెడుతుంది? అనేది కోలీవుడ్లో చర్చనీయాంశమైంది. ధనుష్- ఐశ్వర్యల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా పిల్లల బాధ్యతను మాత్రం సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఇద్దరూ కలిసే పబ్లిక్ ఈవెంట్స్కు హాజరవుతారు. ప్రస్తుతం తల్లి సంరక్షణలో ఉన్నా.. తండ్రి ధనుష్ని పిల్లలు వదిలిపెట్టరు. ప్రధానంగా ధనుష్ సలహాలను తీసుకుంటూ భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం పిల్లల సంరక్షణ బాధ్యతను వీరిద్దరూ స్వీకరించనున్నారు.


Click it and Unblock the Notifications











