Dhurandhar 2: ఇండియాలో ధురంధర్ 2 క్రేజ్.. రణ్వీర్ ఫ్యాన్స్కి ఆ థియేటర్స్లో ఊహకందని ఆఫర్!
ఆదిత్య ధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన లేటెస్ట్ మూవీ ధురంధర్: ది రివెంజ్ (ధురంధర్ 2). గతేడాది విడుదలైన ధురంధర్కు ఈ సినిమా సీక్వెల్. రంజాన్, గుడిపర్వా, ఉగాది పర్వదినాలను పురస్కరించుకుని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో మార్చి 19న వరల్డ్ వైడ్గా ఈ భారీ చిత్రం విడుదల కానుంది. 2026లో భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న మూవీగా ధురంధర్ 2 నిలిచింది. టీజర్, ట్రైలర్లకు తోడు తొలి భాగం భారీ హిట్ కావడంతో ధురంధర్: ది రివెంజ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగినట్లుగానే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రణ్వీర్ సింగ్ అభిమానులకు కొన్ని థియేటర్స్ బంపరాఫర్ ప్రకటించాయి. ఈ వివరాల్లోకి వెళితే..
దురంధర్ 2 తారాగణం
జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్పై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్పాండేలు సంయుక్తంగా ధురంధర్ 2 చిత్రాన్ని నిర్మించారు. రణ్వీర్ సింగ్, సారా అర్జున్లు హీరో హీరోయిన్లుగా నటించారు. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సౌమ్య టాండన్, గౌరవ్ గెరా, మానవ్ గోహిల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలఖ సినిమాటోగ్రాఫర్గా, శివకుమార్ వి పానికర్ ఎడిటర్గా సేవలందించారు. శాశ్వత్ సచ్దేవ్ సంగీత దర్శకత్వం వహించారు.

దురంధర్ 2 బడ్జెట్ & ప్రీ రిలీజ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ధురంధర్ 2 మూవీకి 475 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు (మొదటి భాగంతో కలిపి) ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ధురంధర్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిన నేపథ్యంలో ఈ మూవీ సీక్వెన్స్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే ధురంధర్ 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్లో జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ను జియో హాట్స్టార్ దాదాపు 150 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకుంది. అలాగే శాటిలైట్ రైట్స్ను స్టార్ నెట్వర్క్ 50 కోట్ల రూపాయలకు, మ్యూజిక్ రైట్స్ను టీ- సిరీస్ సంస్థ 45 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకున్నాయి. మొత్తంగా ధురంధర్ 2 ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయల నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ధురంధర్ 2 అడ్వాన్స్ బుకింగ్
అడ్వాన్స్ బుకింగ్లో ధురంధర్ 2 రికార్డుల్ని తిరగరాస్తోంది. మార్చి 18న ప్రదర్శించనున్న పెయిడ్ ప్రీమియర్స్కి గాను 40.54 కోట్ల రూపాయలు రాబట్టినట్లు సాక్నిక్ తెలిపింది. ఇక తొలిరోజు కోసం 15 వేల షోలకు గాను.. 4.70 లక్షల టికెట్లు అమ్ముడై.. 29 కోట్ల రూపాయలు వసూలు చేసింది ధురంధర్ 2. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే.. అమెరికాలో 722 సెంటర్స్కు గాను, 2027 పెయిడ్ ప్రీమియర్ షోలను ఏర్పాటు చేయగా, ఇప్పటి వరకు 88066 టికెట్లు సేల్ అయ్యాయి. తద్వారా 1,400,744 డాలర్లు (భారత కరెన్సీలో 13 కోట్ల రూపాయలు) రాబట్టింది.
దురంధర్ 2 ఓవర్సీస్ కలెక్షన్స్
కెనడాతో కలిపి మొత్తంగా నార్త్ అమెరికాలో ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్లో ధురంధర్ 2కు 1.7 మిలియన్ డాలర్లు (15.71 కోట్ల రూపాయలు) వసూలు చేసింది ధురంధర్ 2. యూరప్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో ప్రీమియర్స్ + ఓపెనింగ్ వీక్ బుకింగ్స్ కలిపి రణ్వీర్ మూవీ ఇప్పటి వరకు 60 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో కేవలం అడ్వాన్స్ బుకింగ్లోనే ధురంధర్ 2 చిత్రం దాదాపు 130 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.
దురంధర్ 2 స్క్రీనింగ్లో ఇబ్బందులు
ఇదిలాఉండగా.. ధురంధర్ 2 సినిమా నిడివి దాదాపు 4 గంటలు ఉండటంతో సినిమా ప్రదర్శన విషయంలో థియేటర్ నిర్వాహకులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. 4 గంటల నిడివితో పాటు ట్రైలర్లు, ఇంటర్వెల్.. ప్రతి షోకు ముందు సన్నద్ధత కలిపి ఒక్కో స్క్రీన్పై దాదాపు 4 గంటల 40 నిమిషాల సమయాన్ని థియేటర్ యజమానులు కేటాయించాలి. దీనికి తోడు ప్రేక్షకుల నుంచి భారీ డిమాండ్ నేపథ్యంలో థియేటర్ యజమానులు సరికొత్త మార్గాన్ని అనుసరించనున్నారు. ధురంధర్ 2ను అర్ధరాత్రి దాటిని తర్వాత కూడా అదనపు షోలను ప్రదర్శించనున్నారట. అదే జరిగితే భారతీయ సినిమా రంగంలో ఇది అరుదైన పరిణామంగా విశ్లేషకులు చెబుతున్నారు.
దురంధర్ 2 కోసం సరికొత్త నిర్ణయం
ప్రేక్షకుల డిమాండ్కు తగినట్లుగా ముంబైలోని పీవీఆర్ చాకాలా, థానేలోని మూవీ మ్యాక్స్ సియోన్ వంటి థియేటర్లలో ఈ వారాంతంలో తెల్లవారుజామున 1.50 గంటలకు షో ప్రారంభమై.. రాత్రి 11.30 వరకు సినిమా ప్రదర్శించనున్నారట. అహ్మదాబాద్లోని కాన్ప్లెక్స్ సినిమాస్ కూడా గురువారం నుంచే అర్ధరాత్రి దాటిన తర్వాత ధురంధర్ 2 షోను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంటే దాదాపు 24 గంటల పాటు థియేటర్లు నడవనున్నాయి. రవాణా, భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో దేశంలోని అన్ని నగరాల్లోనూ ఈ విధానం సాధ్యం కాకపోయినప్పటికీ .. పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని అనేక థియేటర్లలో 24 గంటల పాటు ధురంధర్ 2ను నడపడం ఖాయమని చెబుతున్నారు. 24 గంటల పాటు థియేటర్లలో షోలు అందుబాటులో ఉండటంతో రణ్వీర్ అభిమానులకు పండగే.


Click it and Unblock the Notifications



















