బాలీవుడ్ మూవీ ప్రకటించిన దిల్ రాజు: అల్లరి నరేష్ కథతో.. RRR నటుడితో ప్రాజెక్టు
కొంత కాలంగా తెలుగు సినిమాల స్టామినా భారీ స్థాయిలో పెరిగిపోతోంది. అందుకే మన వాళ్లతో సినిమాలు చేయడానికి వేరే పరిశ్రమలకు చెందిన వాళ్లు పోటీ పడుతున్నారు. అదే సమయంలో టాలీవుడ్లో తెరకెక్కిన చిత్రాలను రీమేక్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో మూవీలు పలు భాషల్లో రీమేక్ అయ్యాయి. అక్కడ కూడా సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. దీంతో తెలుగు వాళ్ల కీర్తి దేశం నలుమూలలా విస్తరించిపోయింది. ఇప్పుడు మరో తెలుగు సినిమా హిందీలో రీమేక్ కాబోతుంది. అదే.. అల్లరి నరేష్ నటించిన విభిన్నమైన చిత్రం 'నాంది'.

ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన 'నాంది' ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. విజయ్ కనకమేడల అద్భుతమైన టేకింగ్ వల్ల బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయబోతున్నారు. ఇందుకోసం తెలుగు బడా నిర్మాత దిల్ రాజు.. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ జత కట్టారు. ఈ మేరకు అజయ్ తన ట్విట్టర్లో 'ముఖ్యమైన కథను అందరికీ తెలియజెప్పే సమయం వచ్చింది. తెలుగు హిట్ మూవీ 'నాంది' హిందీ రీమేక్ కోసం దిల్ రాజుతో కలిసి నా సొంత బ్యానర్లో ఈ సినిమాను నిర్మించబోతున్నా' అంటూ ప్రకటించాడు.

ఇక, ఈ సినిమాకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే ప్రకటిస్తామని కూడా వెల్లడించారు. మరి ఇందులో అజయ్ నటిస్తాడా? లేక ఇంకెవరితోనైనా చేయిస్తాడా? అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. 'నాంది' చిత్రాన్ని కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించాడు. సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమాలో కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలతో పాటు సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీనికి దాదాపు రూ. 3 కోట్ల వరకూ లాభాలు వచ్చాయి.


Click it and Unblock the Notifications











