టాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్పై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్.. బడ్జెట్లో అంతా శాతం హీరోలకేనా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల పారితోషికాలు, సినిమాల పెరుగుతున్న బడ్జెట్లు, నిర్మాతలు ఎదుర్కొంటున్న సమ్యసలు వంటి అంశాలు గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారాయి. భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా వస్తున్న నేపథ్యంలో హీరోల రెమ్యునరేషన్ పై సినీ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. హీరోల పారితోషికాల నుంచి నిర్మాతల బాధ్యతలు, సినిమా నిర్మాణంలో జరిగే లీకేజీలు, ప్రాఫిట్ షేరింగ్ మోడల్ వరకు అనేక ముఖ్యమైన అంశాలపై దిల్ రాజ్ విస్తుకొల్పే విషయాలను వెల్లడించారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాల్లో హీరోల పారితోషికం నిర్మాతలపై ఎంతటి భారంగా మారిందో వివరించారు. "అన్ని సినిమాలకు ఇది వర్తించదు. కానీ రూ.300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కే పెద్ద సినిమాల్లో దాదాపు 35 నుంచి 40 శాతం వరకు కేవలం హీరో పారితోషికానికే వెళ్తుంది. దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది" అని చెప్పారు. హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోకపోవడానికి అసలు కారణం కూడా దిల్ రాజు వివరించారు.

"ఒక్కసారి పారితోషికం పెరిగిన తర్వాత దాన్ని తగ్గించుకోవడం చాలా మందికి ప్రతిష్ట సమస్యగా మారుతుంది. 'నా మార్కెట్ తగ్గిందా?', 'నా ఇమేజ్ పడిపోయిందా?' అనే భావన వారిలో ఉంటుంది. అందుకే మార్కెట్ పరిస్థితులు మారినా తగ్గించుకోవడానికి వెనుకాడుతున్నారు" అని అన్నారు. అయితే వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్ద హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేసే బదులు ఏడాదికి రెండు సినిమాలు చేస్తే పరిశ్రమ టర్నోవర్ కూడా పెరుగుతుందని, ప్రేక్షకులు కూడా తరచుగా థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
టాలీవుడ్ కూడా ఇప్పుడు కొత్త మోడల్ వైపు వెళ్లాల్సిన సమయం వచ్చిందని దిల్ రాజు అన్నారు. బాలీవుడ్లో ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు భారీ అడ్వాన్స్ రెమ్యునరేషన్ తీసుకోవడం మానేసి, సినిమా లాభాల్లో వాటా తీసుకునే విధానాన్ని అనుసరిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ను ఉదాహరణగా ప్రస్తావించారు. "ఒకప్పుడు అక్షయ్ కుమార్ రూ.130 కోట్ల వరకు పారితోషికం తీసుకునేవారు. ఇప్పుడు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఆయన కూడా ప్రాఫిట్ షేరింగ్ మోడల్కు మారారు. ఇది నిర్మాతలకు కూడా ఉపయోగపడుతుంది. సినిమా బాగా ఆడితే హీరోకు ఎక్కువ వస్తుంది. ఫలితం బాగా లేకపోతే నిర్మాతపై మొత్తం భారం పడదు. అలాగే హీరోల్లో కూడా బాధ్యత పెరుగుతుంది" అని వివరించారు.
సినిమా నిర్మాణంలో అసలు రిస్క్ ఎవరిపై ఉంటుందో కూడా దిల్ రాజు వివరించారు. ఒక సినిమా కోసం ఫైనాన్సర్ల నుంచి, డిస్ట్రిబ్యూటర్ల నుంచి, ఇతర వనరుల నుంచి నిధులు సమీకరించి అందరికీ చెల్లించేది నిర్మాతేనని చెప్పారు. సినిమా విజయం సాధిస్తే హీరోలు, దర్శకులు, టెక్నీషియన్ల పారితోషికాలు పెరుగుతాయని, కానీ సినిమా ఫ్లాప్ అయితే ప్రధానంగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ మాత్రమే నష్టాలు భరిస్తారని పేర్కొన్నారు. సినిమా నిర్మాణంలో జరిగే లీకేజీలపై కూడా దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. "ప్రతి సినిమాలో కొంతమేర లీకేజీ ఉంటుంది. నా సంస్థలో నేను పూర్తిగా ఇన్వాల్వ్ అవుతాను కాబట్టి నష్టం తక్కువగా ఉంటుంది. కానీ పూర్తిగా ఆపలేం. ప్రతి విభాగంలో చిన్నచిన్న ఖర్చులు పెరుగుతుంటాయి. ముందస్తు ప్రణాళిక లేకపోతే ఖర్చు మరింత పెరుగుతుంది" అని తెలిపారు.
అనుమతులు ఆలస్యంగా తీసుకోవడం, చివరి నిమిషంలో లొకేషన్లు మార్చడం, మేనేజ్మెంట్ లోపాలు వంటి కారణాలతో బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువవుతుందని చెప్పారు. కొన్నిసార్లు అసలు ఖర్చు కంటే అదనపు ఖర్చులే ఎక్కువగా పెరుగుతాయని ఆయన వెల్లడించారు.
కొంతమంది ఆర్టిస్టుల డేట్లు తీసుకోవడంలో కూడా అదనపు ఒత్తిళ్లు ఎదురవుతాయని దిల్ రాజు చెప్పారు. ముఖ్యంగా స్టార్ హీరోల కంటే కింద స్థాయి ఆర్టిస్టులు, వారి మేనేజర్ల దగ్గర ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయని తెలిపారు. డేట్లు మార్చడం, చివరి నిమిషంలో అదనపు డిమాండ్లు రావడం వంటి అంశాలు కూడా నిర్మాతల ఖర్చును పెంచుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, టాలీవుడ్లో హీరోల పారితోషికాలపై మరోసారి పెద్ద చర్చకు తెరలేపాయి.


Click it and Unblock the Notifications




