సీఎం పదవి కంటే చిరంజీవి పదవి గొప్పదన్న డైరెక్టర్.. మెగాస్టార్ వాయిస్ మెసేజ్.. ఊరికే ఎవరూ గొప్పవారు కారంటూ!
గత కొద్దికాలంగా మెగాస్టార్ చిరంజీవి ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోపక్క సినిమా ఇండస్ట్రీ మొత్తానికి పెద్దగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు మొదలు వ్యాక్సిన్ వేయించే వరకు ఆయన కరోనా చారిటీ సంస్థ ఏర్పరిచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అది కాకుండా సామాన్య ప్రజల అందరి కోసం చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటు చేసిన సేవ చేస్తున్నారు. తాజాగా ఆయన ఒక దర్శకుడికి వాయిస్ నోట్ పంపడం ఆ వాయిస్ నోట్ గురించి సదరు దర్శకుడు కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే.
Recommended Video

దర్శకుడి నుంచి నటుడిగా
దర్శకుడిగా ఆడుతూపాడుతూ, లీలామహల్ సెంటర్, పాండు, బ్లేడ్ బాబ్జి, కెవ్వుకేక, మిస్టర్ పెళ్లి కొడుకు లాంటి సినిమాలను తెరకెక్కించిన దేవీప్రసాద్ తర్వాతికాలంలో నటుడిగా మారిన సంగతి తెలిసిందే.. నీది నాది ఒకే కథ సినిమాలో శ్రీ విష్ణు తండ్రిగా ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది.. ఆ తర్వాత తోలుబొమ్మలాట, ఎన్టీఆర్ కథానాయకుడు, నేనే ముఖ్యమంత్రి, కల్కి లాంటి అనేక సినిమాలలో ఆయన నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

ఆశించే హక్కు లేదు
తాజాగా ఆయన చిరంజీవి చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ ఆరో తేదీన ఒక పోస్ట్ పెట్టారు. ఓ మనిషికి మరో మనిషి నుండి దానాన్నో, దాతృత్వాన్నో తమ హక్కు గా ఆశించే హక్కులేదన్న ఆయన దానికి కొలతలు వేసే హక్కు అసలే లేదు. అది ఇచ్చేవారి హృదయవైశాల్యానికీ, పుచ్చుకొనేవారి కృతజ్ఞతాభావానికి సంబంధించిన విషయం మాత్రమేనని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో తెలుగు సినీ పరిశ్రమలో తోటివారిని కలుపుకుని ఓ పెద్దన్నయ్యలా బాధ్యతను తీసుకొని ఆపన్నులకు అద్భుత సాయాన్ని అందిస్తున్న చిరంజీవి గారిని చిత్రపరిశ్రమ ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుందని అంటూ ఆయన పోస్ట్ లో పేర్కొన్నారు.
"సీఎం"అనే పదవి కంటే "చిరంజీవి" అనే పదవి గొప్పది
అవసరమైన సమయంలో ఆక్సిజెన్ అందించి ప్రాణాలు నిలుపుతున్నందుకు తెలుగుప్రజల మనసుల్లో ఆయన ధన్యజీవి గా నిలిచిపోతారు.
"సి.ఎం."అనే పదవికంటే "చిరంజీవి" అనే పదవి గొప్పది అని ఎవరో అన్నట్లు అచ్చంగా నా అభిప్రాయమూ అదేనని ఆయన పేర్కొంటూ రెండక్షరాల "సి.ఎం" అనే రెండుకాళ్ళ కుర్చీకంటే, నాలుగక్షరాల "మెగాస్టార్" అనే నాలుగుకాళ్ళ సింహాసనం ఎప్పటికీ పదిలమని, రాజకీయపుటెత్తులు పై ఎత్తులు పొత్తులతాకిడి కి ఆ కుర్చీ ఎప్పుడైనా కూలిపోవచ్చు కానీ తరగని అభిమానంతో ప్రేక్షకాభిమానులు వారి హృదయాలలో ప్రతిష్టించుకున్న ఈ సింహాసనం ఎప్పటికీ చెక్కుచెదరదని అంటూ ఆయన స్వయంగా వేసిన ఒక పెయింటింగ్ కూడా షేర్ చేశారు.

నాకు పరిచయం లేదు
ఇక ఈ పోస్ట్ చూసి చిరంజీవి స్వయంగా వాయిస్ నోట్ పంపారట. ఈ విషయాన్ని ఆయన తాజాగా పోస్ట్ చేశారు. చిరంజీవిగారితో నాకు పరిచయం లేదన్న ఆయన ఆయనతో పని చేయలేదు కానీ "మిస్టర్ పెళ్ళికొడుకు"సినిమా తీసినపుడు ఆ ప్రారంభోత్సవానికొచ్చి తొలి క్లాప్ కొట్టి వెళ్ళారని, ఆ కొద్ది సమయానికి నేనాయనకు గుర్తుండే అవకాశమే లేదని అన్నారు. కానీ.... మొన్న నేను ఆయన చేస్తున్న సేవ గురించి నా మనసులో ఉన్నది రాసి,ఆయన బొమ్మ గీసి పోస్ట్ చేసిన 24 గంటలు గడవకముందే ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నాకు వాయిస్ మెసేజ్ పంపారుని అన్నారు.
గొప్పవారు కారని పెద్దలు ఊరికే చెప్పలేదు
మెగాస్టార్ స్వయంగా స్పందన తెలియజేయాల్సిన అవసరం లేదన్న ఆయన ఊరికే ఎవరూ గొప్పవారు కారని పెద్దలు ఊరికే చెప్పలేదని, ఆరాధించే కళ పట్ల మక్కువ, ప్రతిభ, కృషి, ఓ మనిషిని గొప్ప కళాకారుడిగా తయారు చేయొచ్చు కానీ గొప్ప వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే ప్రవర్తన,మంచి మనసును ప్రతిబింబించే చర్యలు మాత్రమే గొప్ప మనిషిగా నిలబెడతాయని అన్నారు. దేవీ ప్రసాద్ గీసిన చిరంజీవి డ్రాయింగ్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











