ఉస్తాద్ భగత్ సింగ్ అసలు కథ ఇది.. ఆ కారణంతో మార్చాం.. : హరీష్ శంకర్
Ustaad Bhagat Singh Pre Release Event: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి పవర్ స్టార్ ఫీవర్ కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆదివారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar)చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించాయి.
దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. 'ఉస్తాద్ భగత్ సింగ్ కోసం మేము ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాం. ఆ ప్రయాణాన్ని కొన్ని నిమిషాల్లో చెప్పడం చాలా కష్టం. నిజానికి ఈ సినిమా అనుకున్న దానికంటే చాలా ఆలస్యమైంది. ఈ సినిమా గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. అది సృష్టి ధర్మం... దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ సినిమా ఎందుకు ఆలస్యమైందో చెప్పాల్సిన బాధ్యత మాత్రం నాదే' అని అన్నారు. సినిమా ప్రారంభంలో తాను ఒక విభిన్నమైన కాన్సెప్ట్తో కథను అనుకున్నట్లు హరీష్ శంకర్ తెలిపారు. ఖుషి సినిమాకు సీక్వెల్లా కాలేజ్ బ్యాక్డ్రాప్లో కథను రూపొందించాలని మొదట భావించామని చెప్పారు.

'ఖుషి సినిమాలో స్టూడెంట్స్ మధ్య జరిగిన క్లాష్ తర్వాత వారు విడిపోతారు. అదే కాలేజీలో తర్వాత వాళ్లు లెక్చరర్లుగా పని చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో కథను ప్రారంభించాం. కానీ సినిమా మొదలైన తర్వాత నేను అనుకున్న హీరోయిజం ఆ కాన్సెప్ట్లో ఫన్ యాంగిల్లో తేలిపోతుందని అనిపించింది. అందుకే కథను పూర్తిగా మార్చాను'అని వివరించారు. కథ మారిన తర్వాత స్క్రిప్ట్ పట్ల పూర్తిగా సంతృప్తి వచ్చే వరకు ఎన్నో ప్రయత్నాలు చేశామని ఆయన చెప్పారు. 'కోవిడ్ పరిస్థితులు, ఇతర కారణాలు కూడా ఈ సినిమా ఆలస్యానికి కారణమయ్యాయి. నిజం చెప్పాలంటే సినిమా ఆలస్యం కావడానికి నేను కూడా ఒక కారణం. అదే సమయంలో సినిమా వేగంగా పూర్తి కావడానికి కూడా కారణం నేనే'అని హరీష్ శంకర్ అన్నారు. ఇంతకాలం తమపై నమ్మకం ఉంచిన నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
మ్యూజిక్ వివాదంపై క్లారిటీ
సినిమా సంగీతం విషయంలో వచ్చిన చర్చలపై కూడా హరీష్ శంకర్ స్పందించారు. ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ ( Devi Sri Prasad) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారు హీరో అయితే, ఆఫ్ స్క్రీన్లో దేవి శ్రీ ప్రసాద్ గారే హీరో. ఆయన ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందించారు. అయితే ఆయన ఇతర ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉండటం వల్ల ఈ ఈవెంట్కు రావడం సాధ్యపడలేదు' అని చెప్పారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే, దేవి శ్రీ ప్రసాద్ షెడ్యూల్కు సమయం సరిపోకపోవడంతో థమన్ ఎస్ (Thaman S)తో బీజీఎం చేయించామని వెల్లడించారు. దీంతో మ్యూజిక్పై వచ్చిన అనుమానాలకు కూడా ఆయన స్పష్టత ఇచ్చారు.
రిలీజ్ డేట్ ముందుకు ఎందుకు?
సినిమా విడుదల తేదీ ముందుకు మార్చిన విషయంపై కూడా హరీష్ శంకర్ వివరించారు. 'మార్చి 19న ఉగాది పండుగ ఉండటం, అలాగే లాంగ్ వీకెండ్ ఉండటం వల్ల ఆ సమయంలో తెలుగు సినిమాలు లేకపోవడం డిస్ట్రిబ్యూటర్లకు అనుకూలంగా కనిపించింది. అందుకే అందరూ కలిసి ఆ తేదీని ఫిక్స్ చేయాలని సూచించారు' అని చెప్పారు. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.
చివరగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ... 'ఈసారి పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఉగాదిని ఘనంగా జరుపుకుందాం' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలా హరీష్ శంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వెనుక జరిగిన ప్రయాణాన్ని మరోసారి అభిమానులకు పరిచయం చేశాయి. సినిమా విడుదలకు ముందు దర్శకుడు ఇచ్చిన ఈ క్లారిటీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











