The Rajasaab: ప్రభాస్ను అంచనా వేయలేకపోయా..: డైరెక్టర్ మారుతి క్షమాపణ..
The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తొలిసారిగా హారర్ జానర్లో నటించిన సినిమా ది రాజాసాబ్ ( The Raja Saab) జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ మారుతి (Maruthi) దర్శకత్వం వహించారు. అయితే సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోవడం, సోషల్ మీడియాలో ట్రోల్స్ జరగడం చర్చనీయాంశంగా మారింది. కొందరు అభిమానులు 'వింటేజ్ ప్రభాస్' లుక్స్ చూసి ఖుషీ అవుతుంటే, మరికొందరు మాత్రం కథనం గందరగోళంగా ఉందని, సినిమా పూర్తిగా ఎంగేజ్ చేయలేకపోయిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మిక్స్డ్ టాక్ మధ్యే 'బ్లాక్బస్టర్' సక్సెస్ మీట్
ఈ నేపథ్యంలో రాజాసాబ్ మూవీ యూనిట్ 'రాజాసాబ్ కింగ్ సైజ్ బ్లాక్బస్టర్' అంటూ శనివారం (జనవరి 10) సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు మారుతి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, హీరోయిన్లు నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ హాజరయ్యారు. అయితే మిక్స్డ్ టాక్ నడుస్తున్న వేళ సక్సెస్ మీట్ పెట్టడంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తుంది.

మారుతి క్షమాపణ
రాజాసాబ్ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ మారుతి కీలక వ్యాఖ్యలు చేశారు. విమల్ థియేటర్లో ప్రీమియర్ షోల సమయంలో మీడియా మిత్రులు తీవ్ర అసౌకర్యానికి గురైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పారు. 'అర్ధరాత్రి 1.30వరకూ ప్రెస్ షోలు పడకపోవడంతో చలిలో నిలబడ్డారు. మిమ్మల్ని ఇబ్బందిపెట్టినందుకు చాలా చాలా సారీ. అసలు ఇలా జరుగుతుందని నాకు తెలియదు. అయినా అర్ధరాత్రి సినిమా చూసి ఉదయం నాలుగు గంటలకే రివ్యూలు ఇచ్చారు. థాంక్యూ సో మచ్'అంటూ మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.
మూడేళ్ల కష్టం... ప్రభాస్కు రుణపడి ఉంటా
తాను సాధారణంగా తొమ్మిది నెలల్లో సినిమా పూర్తి చేసే దర్శకుడినని, కానీ 'రాజాసాబ్' కోసం మాత్రం మూడేళ్ల పాటు ఎంతో కష్టపడి పనిచేశానని మారుతి చెప్పారు. 'నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభాస్కు జీవితాంతం రుణపడి ఉంటాను. ప్రభాస్కు నచ్చేలా, అభిమానులు మెచ్చేలా ఈ సినిమాను తీశాను. ముఖ్యంగా క్లైమాక్స్కు ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రశంసలు వస్తున్నాయి' అని ఆయన పేర్కొన్నారు. సినిమా ఫలితాన్ని ఒక్క రోజులోనే నిర్ణయించకూడదని మారుతి కోరారు. 'కొత్త పాయింట్తో వచ్చిన సినిమాలు వెంటనే ఎక్కవు. పది రోజులు ఆగితే అసలు రిజల్ట్ ఏంటో తెలుస్తుంది. సినిమాలోని కొన్ని సీన్స్ అర్థమైనవాళ్లు పొగుడుతున్నారు, అర్థం కానివాళ్లు తిడుతున్నారు. కాబట్టి అప్పుడే తీర్పు ఇవ్వొద్దు'అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
రీ-ఎడిట్తో 'రియల్ రాజాసాబ్'
ప్రభాస్ అభిమానులను ఎక్కువగా నిరాశపరిచిన అంశం ట్రైలర్లో చూపిన ప్రభాస్ ఓల్డ్ గెటప్ థియేటర్లలో లేకపోవడమే. దీనిపై స్పందించిన మారుతి... 'టెక్నికల్ ఇష్యూ కారణంగా ప్రభాస్ సెకండ్ లుక్కు సంబంధించిన కొన్ని సీన్స్ రిలీజ్ రోజున యాడ్ చేయలేకపోయాం. ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఆ సీన్స్ జత చేస్తున్నాం. ఎక్కడ సాగదీత ఉందన్నారో అక్కడ షార్ప్ చేశాం. ఈరోజు ఈవినింగ్ షోల నుంచే రీ-ఎడిట్ చేసిన 'రియల్ రాజాసాబ్'ను చూపిస్తాం' అని క్లారిటీ ఇచ్చారు. ఇతర కమర్షియల్ సినిమాలు లాగానే ప్రభాస్ తో సినిమా తీయచ్చు అనుకున్న కానీ, ఇలా జరుగుతుందని అంచనా వేయలేకపోయా. ప్రభాస్ స్వాగ్ వేరే లెవెల్ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు
ఇక మరోవైపు సినిమా నిరాశపరిచిందంటూ కొంతమంది ప్రభాస్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు మారుతిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. ప్రభాస్ ఒక్కడే వన్ మ్యాన్ షో, కథ బలహీనంగా ఉంది, మారుతి చెప్పినంత లేదు వంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి. మొత్తంగా చూస్తే.. ది రాజాసాబ్ విషయంలో తొలి రోజు స్టార్డమ్ ఓపెనింగ్ తెచ్చిపెట్టినా, కంటెంట్పై మిక్స్డ్ స్పందన రావడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు రీ-ఎడిట్ చేసిన వెర్షన్, యాడ్ చేసిన సీన్స్తో పరిస్థితి మారుతుందా? పది రోజులు గడిచాక మారుతి చెప్పినట్లే ప్రభాస్ స్టామినా బయటపడుతుందా? అన్నదే అసలు ప్రశ్నగా మారింది.


Click it and Unblock the Notifications











