కల్కిలో జక్కన్న గెస్ట్ రోల్.. రాజమౌళిని నాగ్ అశ్విన్ ఎలా ఒప్పించారంటే?
తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి చరిత్రలో నిలిచిపోతారు. డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఓటమి ఎరుగని దర్శకుడిగా జక్కన్న అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. సినిమా సినిమాకు టాలీవుడ్ పంథాను మారుస్తూ ఇప్పుడు భారతీయ చలన చిత్ర పరిశ్రమకు టార్చ్ బేరర్గా మారారు రాజమౌళి. కమర్షియాలిటీకి, హీరోయిజానికి దర్శకధీరుడి సినిమాలు నిదర్శనంగా నిలుస్తాయి. ఆయన సినిమాల్లోని ప్రతి సీన్ ఓ క్లైమాక్స్లా ప్రేక్షకుడిని కుర్చీలో కుదురుగా కూర్చోనివ్వదు.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెం 1, సింహాద్రి, ఛత్రపతి, సై, యమదొంగ, విక్రమార్కుడు, మగధీర, ఈగ, మర్యాదరామన్న, బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఒక్కొక్కటి ఒక్కో మచ్చు తునక. సినిమా మేకింగ్, మార్కెటింగ్ స్ట్రాటజీలను రాజమౌళీ సమూలంగా మార్చివేశారు. పాన్ ఇండియా కల్చర్ను భారతదేశానికి పరిచయం చేయగా.. ఇప్పుడు ఆయన వేసిన బాటలో ఎన్నో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తెరకెక్కి బీటౌన్లో సౌత్ జెండాను ఎగురవేస్తున్నాయి. ఇదంతా రాజమౌళి వల్లనే అనేది ఎవరైనా అంగీకరించాల్సిందే.

సినీ రంగానికి అందించిన సేవలకు గాను రాజమౌళిని ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. భారత ప్రభుత్వం ఆయనను అత్యున్నత పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. ప్రస్తుతం సూపర్స్టార్ మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కించేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మీడియాకు, పబ్లిక్కు దూరంగా తనదైన లోకంలో గడుపుతుంటారు రాజమౌళి. సినిమా ఈవెంట్స్కు హాజరవ్వడంతో పాటు మంచి సినిమాలను చూడాల్సిందిగా ప్రమోట్ చేస్తుంటారు. కొత్త దర్శకులను వెన్నుతట్టి ప్రోత్సహించడంలో జక్కన్న ఎప్పుడూ ముందుంటారు.
తన సినిమాలు, స్క్రిప్ట్ వర్క్ ఇతరత్రా పనుల్లో బిజీగా ఉంటూ ఎంతోమందిని స్టార్స్గా నిలబెట్టిన రాజమౌళీ ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమాలో రాజమౌళి తలుక్కున మెరిశారు. తెరపై ఆయన కనిపించగానే ప్రేక్షకులు ఈలలు, కేకలతో మోత మోగించారు. బుజ్జిపై వెళ్తున్న ప్రభాస్ను రాజమౌళి వెంటాడుతూ ఉంటాడు. అప్పుడు ప్రభాస్.. అమ్మో ఈయనకు దొరికితే ఐదేళ్లు దూల తీర్చేస్తాడని కామెంట్ చేస్తాడు. దీనికి రాజమౌళి మళ్లీ దొరుకుతావ్ కదా ఈసారి పదేళ్లు దూల తీర్చేస్తానని సెటైర్ వేస్తాడు.

రాజమౌళీతో పాటు మరో అగ్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం కల్కిలో అతిథి పాత్ర పోషించారు. అయితే వారిద్దరినీ సినిమాలో నటించేలా ఎలా ఒప్పించగలిగారని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. ఆయా పాత్రల కోసం వారిద్దరినీ ఒప్పించానని, మంచి మనసుతో వాళ్లు అంగీకరించారని తెలిపారు. ప్రభాస్ - అమితాబ్ల మధ్య యాక్షన్ సీక్వెన్స్లు తీయాలనేది తన కల అని అందుకు వారిద్దరూ అంగీకరించడం ఎంతో ఆనందం కలిగించిందని నాగ్ అశ్విన్ వెల్లడించారు. అశ్వత్థామ పాత్రకు అమితాబ్ను తప్పించి మరొకరిని ఊహించుకోలేమని.. ఆయన మాత్రమే ఈ పాత్రను పవర్ఫుల్గా పోషించగలరని చెప్పారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











