ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. కరోనా కర్కశత్వానికి బలైన టాలెంటెడ్ డైరెక్టర్.. విషాదంలో సినీ ప్రముఖులు
సినీ పరిశ్రమను కరోనావైరస్ అతలాకుతలం చేస్తున్నది. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు కరోనావైరస్ బారిన పడి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ను మరో విషాదం వెంటాడింది. నటుడు పొట్టి వీరయ్య మరణాన్ని ఇంకా జీర్ణించుకోక ముందే ప్రముఖ దర్శకుడు సాయి బాలాజీను కరోనావైరస్ మింగేసింది. ప్రతిభావంతుడైన దర్శకుడి మరణంతో సినీ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. సాయి బాలాజీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్బంగా పంచుకొంటున్నారు.
గ్లామర్తో అదరగొట్టిన రత్తాలు.. ఈ సమయంలో అక్కడ రాయ్ లక్ష్మి జిగేల్

గచ్చిబౌలి టిమ్స్ హాస్పిటల్లో
కొద్ది రోజుల క్రితం కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో చికిత్స పొందుతున్నారు. ఆ క్రమంలో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పరిస్థితి విషమించింది. ఆ క్రమంలో ఆయన చికిత్స పొందుతూ మరణించారు అని సన్నిహితులు తెలిపారు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన 57 ఏళ్ళ సాయిబాలాజీకి భార్య గౌరి, కుమార్తె స్నేహ పూజిత ఉన్నారు. కుటుంబ సభ్యులందరికీ అనుకోకుండా కరోనా సోకడంతో, వారం రోజుల నుంచి చికిత్స తీసుకున్నారు. మిగతా కుటుంబసభ్యులు ఇద్దరూ ఇంట్లోనే కోలుకున్నప్పటికీ, ఆయన మాత్రం గచ్చిబౌలి టిమ్స్ హాస్పిటల్లో చివరి చూపు అయినా దక్కకుండా ఆకస్మికంగా ప్రాణాలు వదలడం విషాదం. సోమవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు ముగిశాయి.

మూడు చిత్రాలకు దర్శకుడిగా
తన కెరీర్లో దివంగత శ్రీహరితో శివాజీ, ఒరేయ్ తమ్ముడు, దివంగత ఉదయ్ కిరణ్తో జై శ్రీరాం చిత్రాలను రూపొందించారు. మూడు చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించినప్పటికి ఆయన ప్రముఖ దర్శకుల వద్ద పనిచేశారు. జయంత్ సీ పరాంజీ దర్శకత్వంలో చిరంజీవి నటించిన బావగారు బాగున్నారా సినిమాకు స్క్రీన్ ప్లే రచయితగా కూడా పనిచేశారు. సాయి బాలాజీకి స్క్రీన్ ప్లే రైటర్గా మంచి పేరు ఉంది.

ఎమ్మెస్ నారాయణతో పెదరాయుడు చిత్రంలో
తెలుగు సినీ పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడే సినీరంగానికి వచ్చిన సాయిబాలాజీ ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిసెట్టి వద్ద దర్శకత్వ శాఖలో శిష్యరికం చేశారు. మోహన్ బాబు 'పెదరాయుడు', బాలకృష్ణ 'బంగారు బుల్లోడు', వెంకటేశ్ 'చంటి' తదితర అనేక చిత్రాలకు ఆయన పనిచేశారు. రచయిత ఎమ్మెస్ నారాయణతో 'పెదరాయుడు'లో పాత్ర వేయించి, తెర మీదకు నటుడిగా తీసుకురావడంలో సాయిబాలాజీ కీలకపాత్ర వహించారు. చాలాకాలం పాటు నటుడు నాగబాబుకు చెందిన అంజనా ప్రొడక్షన్స్ దర్శక, రచనా శాఖలో ఆయన పనిచేశారు.

కృష్ణవంశీ, వైవీఎస్ చౌదరీ వద్ద..
ముక్కుసూటితనం వెనుక మంచితనం మూర్తీభవించిన సాయిబాలాజీ సినీ రంగంలో నటుడు ప్రకాశ్ రాజ్ తో సహా పలువురికి ఇష్టులు. స్నేహితులైన దర్శకులు కృష్ణవంశీ, వై.వి.ఎస్. చౌదరి రూపొందించిన సినిమాలకు కథా విభాగంలో ఆయన కీలకపాత్ర పోషించారు. సినిమా, స్క్రిప్టులపై సాయిబాలాజీ నిష్కర్షగా వ్యక్తం చేసే అభిప్రాయాలను పలువురు దర్శక, నిర్మాతలు గౌరవించేవారు అని ఆయన సన్నిహితులు ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు.
Recommended Video

ప్రపంచ సినిమాపై పట్టుగల దర్శకుడిగా
ప్రపంచ సినిమాతో పాటు వివిధ భారతీయ భాషా చిత్రాలపై ఆయనకు పట్టు ఎక్కువ. సినీ కథ, కథనాల్లోని తాజా మార్పులను ఎప్పటికప్పుడు గమనించి, నిశితంగా విశ్లేషించడంలో సాయిబాలాజీ దిట్ట. ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం పలు సినిమా స్క్రిప్టులతో పాటు ఇటీవల కొన్ని వెబ్ సిరీస్ ల రూపకల్పనకు కూడా ఆయన సన్నాహాలు చేసుకుంటూ వచ్చారు. ఇంతలోనే కరోనా మహమ్మారి ఆయనను తీసుకుపోయింది.


Click it and Unblock the Notifications











