Vikramaditya ప్రముఖ డైరెక్టర్ కుమారుడు టాలీవుడ్ ఎంట్రీ.. భారీ బడ్జెట్తో పిరియాడిక్ లవ్ స్టోరి!
తెలుగు సినిమాకు భారీ విజయాలను అందించిన దర్శకుడు తేజ వరుస చిత్రాలతో బీజీగా మారిపోతున్నారు. గత కొద్దికాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న ఈ టాప్ డైరెక్టర్.. నేనే రాజు.. నేనే మంత్రి సినిమాతో మళ్లీ ఫామ్లోకి వచ్చారు. లాక్డౌన్ కాలంలో దగ్గుబాటి వారసుడితో సినిమాను వేగంగా పూర్తి చేస్తూనే మరో సినిమాను ఫిబ్రవరి 22వ తేదీన ప్రకటించాడు. ఈ సినిమాలో స్వయంగా ఆయన కుమారుడే హీరో కావడం విశేషంగా మారింది. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

దగ్గుబాటి అభిరామ్ హీరోగా..
డైరెక్టర్ తేజ విషయానికి వస్తే.. ఎంతో మంది కొత్త నటీనటులను తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు. నితిన్, నవదీప్ లాంటి వారితోపాటు పేద పిల్లలను కూడా వెండితెరపై స్టార్లను చేశాడు. తాజాగా దగ్గుబాటి వారసుడు అభిరామ్ను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు. అహింస అనే చిత్రాన్ని వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో తేజ ఫిబ్రవరి 22న తన పుట్టిన రోజు సందర్భంగా మరో సినిమాను ప్రకటించారు.

పుట్టిన రోజున విక్రమాదిత్యను ప్రకటించిన తేజ
విక్రమాదిత్య అనే ప్రేమ కథను తెరకెక్కిస్తున్నాను అంటూ తేజ తన పుట్టిన రోజున ప్రకటించారు. ఈ కథ 1836 సంవత్సరం నాటిది అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. 22-02-2022 రోజున 2.22 గంటలకు షూటింగ్ ప్రారంభం అవుతుంది అని పోస్టర్లో వెల్లడించారు. ఈ సినిమాను భవ్య సమర్పిస్తుండగా లక్ష్మీ నర్సింహా ప్రొడక్షన్స్ బ్యానరపై ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు.

1836లో బ్రిటీష్ పాలన నేపథ్యంగా
విక్రమాదిత్య చిత్రం బ్రిటీష్ పాలన నేపథ్యంగా అప్పడు జరిగిన సంఘటనల ఆధారంగా చేసుకొని రూపొందుతున్నది. ఈ కథలో ధవళేశ్వరం బ్యారేజ్ కట్టిన సర్ ఆర్థర్ కాటన్ను ప్రస్తావిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. తేజ మరోసారి పక్కా కథతో వస్తున్నాడనే సంకేతాలను పోస్టర్ స్పష్టం చేసింది.

కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ.
భావోద్వేగంతో కూడిన ప్రేమకథ విక్రమాదిత్య చిత్రం ద్వారా దర్శకుడు తేజ తన కుమారుడిని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు. ఇటీవల నట శిక్షణను పూర్తి చేసుకొన్న అమితవ్ తేజను ఈ సినిమా ద్వారా లాంచ్ చేయడానికి సిద్దమయ్యారు. తన కుమారుడి టాలెంట్ను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి తేజ మంచి కథను ఎన్నుకొన్నట్టు సినీ వర్గాలు వెల్లడించాయి.

భారీ బడ్జెట్ మూవీతో మరోసారి
ఇక విక్రమాదిత్య పోస్టర్ విషయానికి వస్తే.. ఒక రైలు బండి పొగలు కక్కుతూ వస్తుంటే.. ఆ పొగల మధ్య ఇద్దరు ప్రేమికులు కౌగిలించుకొంటూ కనిపించారు. పోస్టర్పై ఇన్ ది ఇయర్ 1836 విక్రమాదిత్య అంటూ తెలిపారు. అయితే ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మాత బుజ్జి రూపొందిస్తున్నారు. తేజ కెరీర్లో అతిపెద్ద బడ్జెట్ అని చెబుతున్నారు. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా తన కుమారుడు అమితవ్కు దర్శకుడు తేజ ఎలాంటి హిట్ ఇస్తాడో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











