రామ్ చరణ్కు క్షమాపణ చెప్పిన శ్రీహరి భార్య.. ఆ విషయంలో తప్పు చేశానంటూ..
డిస్కో శాంతి (Disco Shanthi) అప్పటి తెలుగు సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ఎనభై, తొంభై దశకాల్లో తన ఎనర్జిటిక్ డ్యాన్స్లు, గ్లామర్ ప్రెజెన్స్, హుషారైన స్టేజ్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఐటం సాంగ్స్తో సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె అసలు పేరు శాంత కుమారిగా కాగా.. సినిమాల్లో నటనతో డిస్కో శాంతిగా ముద్రపడిపోయింది. డిస్కో శాంతి దాదాపు 900కి పైగా చిత్రాలలో కనిపించింది. ఆమె ఎక్కువగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఒడియా భాషల్లో నటించారు. ఆమె నటిగా మాత్రమే కాదు, అద్భుతమైన డ్యాన్సర్గా కూడా డిస్కో శాంతి ప్రత్యేక స్థానం సంపాదించారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు క్షమాపణ చెప్పింది. ఏం జరిగిందంటే?
నిర్మాతలు, దర్శకులు కూడా సినిమాల్లో ప్రేక్షకులకు అదనపు ఆకర్షణగా ఆమెను ఎంపిక చేసేవారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ స్టెప్స్, గ్లామర్ అన్ని కలిపి ఆ కాలంలో ప్రత్యేక క్రేజ్ తెచ్చాయి. అందుకే ఇప్పటికీ ఆమె పేరు చెప్పగానే చాలామంది ప్రేక్షకులకు పాత రోజుల జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అయితే కెరీర్ పీక్లో ఉన్న సమయంలోనే ఆమె వ్యక్తిగత జీవితంలో కొత్త మలుపు తిరిగింది. టాలీవుడ్లో విలక్షణ నటుడిగా, రియల్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ హరి (Srihari)తో ప్రేమలో పడి 1996లో వివాహం చేసుకున్నారు. ఈ జంట అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్. పెళ్లి తర్వాత డిస్కో శాంతి సినిమాలకు కాస్త దూరమై కుటుంబ బాధ్యతలను చూసుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టారు.

శ్రీహరి మాత్రం హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమాలతో కొనసాగారు. ఆయన తెరపై చూపించిన పవర్ఫుల్ నటన, నిజాయితీ వ్యక్తిత్వం కారణంగా ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. కానీ, 2013 అక్టోబర్ 9న అనారోగ్య కారణాలతో ఆయన మరణించడం సినీ పరిశ్రమకు పెద్ద షాక్గా మారింది. శ్రీహరి మరణం తర్వాత డిస్కో శాంతి పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుతం కుటుంబం, పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఇటీవల శ్రీహరి పెద్ద కుమారుడు సినీ రంగంలోకి అడుగుపెట్టడంతో కుటుంబం మళ్లీ వార్తల్లో నిలిచింది.
ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డిస్కో శాంతి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా మగధీర (Magadheera)సినిమా గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాలో శ్రీహరి చేసిన పాత్ర ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. హీరో రామ్ చరణ్ (Ram Charan) కెరీర్లో మైలురాయిగా నిలిచిన ఈ సినిమాలో శ్రీహరి పాత్ర కూడా ప్రధాన బలంగా నిలిచింది. అయితే, ఆ పాత్ర చేయొద్దని తానే మొదట శ్రీహరికి చెప్పానని డిస్కో శాంతి వెల్లడించారు.
డిస్కో శాంతి మాట్లాడుతూ.. 'ఆ సమయంలో నా ఆలోచన వేరుగా ఉండేది. ఒక హీరో భార్యగా హీరో పాత్ర వేరు.. సపోర్టింగ్ క్యారెక్టర్ వేరు అని భావించేదాన్ని. అందుకే శ్రీహరి గారికి మగధీర సినిమాలో సపోర్టింగ్ పాత్ర చేయొద్దని చెప్పాను' అని తెలిపారు. రాజమౌళి సినిమా కావడంతో హీరోగా అయితే చేయమని చెప్పేదాన్నని, కానీ, క్యారెక్టర్ రోల్ అనే సరికి వద్దనుకున్నానని ఆమె స్పష్టం చేశారు.
అప్పటివరకు శ్రీహరి తనకు మగధీర కథ కూడా చెప్పలేదని, అందుకే పాత్ర ప్రాధాన్యత ఏమిటో అర్థం కాలేదని వెల్లడించారు. అయితే సినిమా విడుదలైన తర్వాత చూసినప్పుడు తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని చెప్పారు. 'మగధీరలో శ్రీ హరి పాత్ర లేకపోతే సినిమానే లేదు. అంత అద్భుతంగా ఆ పాత్రను రూపొందించారు. రాజమౌళి గారు ఎంత మనసు పెట్టి ఆ పాత్రను చేయించారో తర్వాత అర్థమైంది' అంటూ ఆమె ప్రశంసించారు. ఇదే సందర్భంగా ఆమె రామ్ చరణ్ (Ram Charan)కు కూడా క్షమాపణలు చెప్పారు. 'రామ్ చరణ్ సినిమాలో శ్రీహరి అతిథి పాత్ర చేస్తున్నారని అనుకుని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆ సమయంలో అలా చెప్పినందుకు ఇప్పుడు నన్ను క్షమించాలి'అంటూ డిస్కో శాంతి అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.
నిజానికి ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మగధీర సినిమా సంచలన విజయంగా క్రియేట్ చేసింది. హీరోగా రామ్ చరణ్కు ఇది పెద్ద బ్రేక్ ఇవ్వగా, శ్రీహరి పోషించిన పాత్ర కూడా కథలో కీలకంగా నిలిచింది. ఆయన నటన, డైలాగ్ డెలివరీ, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. డిస్కో శాంతి మాటల్లోనే చెప్పాలంటే.. 'సినిమా చూసాకే నాకు తెలిసింది. ఆ పాత్ర లేకపోతే కథకు బలం ఉండేది కాదు' ఈ వ్యాఖ్యలతో శ్రీహరి నటనపై మరోసారి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


Click it and Unblock the Notifications





