పవన్ కల్యాణ్తో నిర్మాత సురేష్ బాబు గొడవ.. వారిద్దరి మధ్య చిచ్చుకు కారణం అదేనంట!
తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ మొఘల్గా తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు డాక్టర్ డీ. రామానాయుడు. పది రూపాయల నోటుపై ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భారతీయ భాషల్లోనూ సినిమాలు తీసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకున్నారు. నిర్మాతగానే కాకుండా మంచి మనిషిగా, దానశీలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రామానాయుడు తర్వాత ఆయన కుమారులు సురేష్ బాబు , వెంకటేష్లు కూడా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. వెంకటేష్ హీరోగా పరిచయమై .. దశాబ్ధాలుగా తెలుగు తెరను మోస్తున్న నలుగురు అగ్ర కథానాయకుల్లో ఒకరిగా నిలిచారు. సురేష్ బాబు మాత్రం సినిమాల్లో నటించకుండా, తండ్రి మాదిరే నిర్మాతగా మారారు.
సినిమాలు, తన కుటుంబం తప్పించి మరో ఇష్యూలో సురేష్ బాబు తలదూర్చరు. వివాదాలకు దూరంగా, పరిశ్రమలో అందరికీ తలలో నాలుకలా ఉంటారు. అంతేకాదు.. తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లు నిర్మించడమో, లీజుకు తీసుకోవడమో చేస్తూ డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని కూడా శాసిస్తున్నారు. వీలున్నప్పుడల్లా ఇంటర్వ్యూలు ఇస్తూ తన మనోగతాన్ని పంచుకుంటూ ఉంటారు సురేష్ బాబు. తాజాగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, సినిమా ప్రయాణం సహా తదితర అంశాలపై కీలక విషయాలు వెల్లడించారు.

వయసులో ఉన్నప్పుడు తాను కమల్ హాసన్లా ఉండేవాడినని.. అలాగే తన కారు, కమల్ కారు ఒకే మోడల్ కావడంతో అంతా తనను కమల్ హాసన్ అని పిలిచేవారని సురేష్ బాబు గుర్తుచేసుకున్నారు. నన్ను హీరోగా పెట్టి భారతీ రాజా ఓ సినిమా తీయడానికి ముందుకు వచ్చారని.. అయితే తనకు ఇంట్రెస్ట్ లేకపోవడంతో సున్నితంగా తిరస్కరించానని ఆయన తెలిపారు. తొలి నుంచి వ్యాపారం చేయాలనే ఉండేదని, అందుకు తగ్గట్టుగానే నిర్మాతని అయ్యానని సురేష్ బాబు వెల్లడించారు.
ఇదే ఇంటర్వ్యూలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్తో గోపాల గోపాల సినిమా విషయంలో చోటు చేసుకున్న గొడవ గురించి యాంకర్ ప్రశ్నించగా.. సురేష్ బాబు తనదైనశైలిలో ఆన్సర్ ఇచ్చారు. పవన్ తనకు మంచి మిత్రుడని అప్పుడు మా మధ్య చిన్న చిన్న విభేదాలే వచ్చాయని .. తర్వాత సర్దుకున్నాయని ఆయన పేర్కొన్నారు. పవన్ రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు సంతోషించానని , ఆయన అనుకున్నది సాధిస్తారని భావించానని సురేష్ బాబు వెల్లడించారు. అయితే పవన్తో ఏ ఇష్యూలో గొడవ జరిగిందనేది మాత్రం ఆయన చెప్పలేదు.
అయితే ఫిలింనగర్ వర్గాలు చెబుతున్న దానిని బట్టి రెమ్యూనరేషన్ విషయంలోనే సురేష్బాబుకి పవన్ మధ్య గొడవలు జరిగాయట. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ , నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సురేష్ బాబు, శరత్ మరార్లు నిర్మించారు. ఇందుకోసం తొలుత పవన్ కళ్యాణ్ నెల రోజుల పాటు కాల్ షీట్స్ ఇచ్చారు.. ఆ తర్వాత అదనంగా మరో 15 రోజులు కాల్ షీట్స్ ఇవ్వాలని సురేష్ బాబు కోరడంతో పవన్ కాదనకుండా ఇచ్చారు.

అయితే అవి కూడా చాలకపోవడంతో సురేష్ మరికొన్ని కాల్ షీట్స్ అడిగారట. అదనపు కాల్ షీట్స్ ఇస్తే .. ముందు అనుకున్న దాని కంటే ఎక్కువ ఇవ్వాలని అగ్రిమెంట్లో ఉందట. కానీ సురేష్ బాబు మాత్రం ఇప్పటికే బడ్జెట్ ఎక్కువైందని, ముందు అనుకున్న పారితోషికమే ఇస్తానని అన్నారట. పవన్ అందుకు అంగీకరించి సురేష్ బాబు ఇస్తానన్న రెమ్యూనరేషన్ తీసుకుని ఆపై ఆయనతో మాట్లాడటం మానేశారట.


Click it and Unblock the Notifications











