800 మూవీ నుంచి విజయ్ సేతుపతి ఎందుకు తప్పుకొన్నారంటే? మురళీధరన్ షాకింగ్ విషయాలు..
లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ 800 విడుదలకు సిద్దంగా ఉంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన చిత్రానికి దర్శకుడు శ్రీపతి రూపొందించగా, శ్రీదేవీ మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మురళీధరన్ పాత్రలో 'స్లమ్డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. అక్టోబర్ 6న థియేటర్లలో సినిమా విడుదల అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
వాస్తవానికి మురళీధరన్ బయోపిక్లో ముందుగా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించాల్సి ఉంది. మురళీధరన్ పాత్రలో నటించడానికి కూడా అంగీకారం తెలిపారు. మురళీధరన్ పాత్ర కోసం ఆయన ప్రిపిరేషన్ కూడా ప్రారంభించారు. అయితే అనూహ్యంగా మురళీధరన్ బయోపిక్ నుంచి విజయ్ సేతుపతి తప్పుకోవడం యూనిట్ను దిగ్బ్రాంతికి గురి చేసింది.

అయితే 800 బయోపిక్ గురించి ఎందుకు తప్పుకొన్నాననే విషయాన్ని ఇటీవల ముత్తయ్య మురళీధరన్ వివరించారు. ఐపీఎల్ ఆడుతున్న సమయంలో దర్శకుడు శ్రీపతి, నేను ఒకే హోటల్లో ఉన్నాం. ఆ సమయంలో మేమిద్దరం కలుసుకొన్నాం. ఆ సమయంలో మా మధ్య నా జీవిత కథను సినిమాగా తీయాలని అనుకొంటున్నానని, దాని కోసం కలుసుకొందామని చెబితే నేను ఆయనను కలువడానికి ఇష్టపడలేదు. కానీ ఆ తర్వాత నేను నా ఫ్యాన్గా ఆయన అడిగారనే ఉద్దేశంతో కలిశాం. ఐదు రోజుల పాటు 2 గంటల చొప్పున కలిశాం అని మురళీధరన్ చెప్పారు.
దర్శకుడు శ్రీపతితో ఐదు రోజుల్లో చర్చల తర్వాత ఓ రోజు కథ చెప్పారు. ఆ కథ విన్న తర్వాత ఆయనలో సినిమా తీయాలనే తపన, ఉత్సాహం, నిజాయితీ కనిపించింది. ఆ తర్వాత కొన్ని చర్చల తర్వాత 800 మూవీ ప్రాజెక్టుకు ఒకే చెప్పాను. దాంతో నిర్మాత, బ్యానర్ అన్నీ సెటిల్ అయ్యాయి అని మురళీధరన్ చెప్పారు.

800 మూవీలో నా పాత్రను ఎవరు చేస్తారనే విషయం చర్చకు వచ్చినప్పుడు విజయ్ సేతుపతి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆయన కూడా ఈ సినిమాలో చేయడానికి ఒప్పుకొన్నారు. కానీ రాజకీయ ఒత్తిడి ఆయనపై పెరిగింది. ఆయనకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. దాంతో ఆయన కుటుంబంపై కూడా ఒత్తిడి పెరిగింది. దాంతో ఈ సినిమా నుంచి తప్పుకొన్నాడు అని మురళీథరన్ చెప్పారు.
800 మూవీ కేవలం స్పోర్ట్స్ మూవీ. ఇందులో రాజకీయాలు కానీ, ఇతర వివాదాస్పద అంశాలు లేవు. అయితే ఈ సినిమా కారణంగా విజయ్ సేతుపతి కెరీర్కు కూడా ఇబ్బంది కలుగాలని భావించలేదు. విజయ్ సేతుపతి స్థానంలో నా పాత్రను మధుర్ మిట్టల్ చేశాడు. అప్పటికే ఆయన స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు అని మురళీధరన్ తెలిపారు.


Click it and Unblock the Notifications











