బెట్టింగ్ యాప్ కేసులో రానా, విజయ్ దేవరకొండ .. 29 మంది సెలబ్రెటీలపై ఈడీ కొరడా
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వ్యవహారంలో 29 మంది టాలీవుడ్ సెలబ్రెటీలు, కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు నమోదు చేసింది. వీరిలో సినీనటులు, బుల్లితెర నటులు, యాంకర్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఉన్నారు. ఇప్పటికే వీరిపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.
దేశాన్ని వణికించిన మహదేవ్ బెట్టింగ్ స్కామ్
దేశంలో ఆన్లైన్ మోసాలు నానాటికి పెరుగుతున్న సంగతి తెలిసిందే. వీటిలో బెట్టింగ్ యాప్స్ కూడా ఒకటి. చాప కింద నీరులా యువతకు వీటిని వ్యసనంలా అలవాటు చేస్తున్నారు. ఎంతోమంది ఈ బెట్టింగ్ యాప్స్కి చిక్కి అప్పుల పాలై బలవన్మరణానికి పాల్పడుతున్నారు. వీటిని నియంత్రించాలని నిపుణులు, మేధావులు నెత్తినోరు బాదుకుంటున్నారు. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసిన ఈ బెట్టింగ్ యాప్స్ను కొందరు సెలబ్రెటీలు ప్రమోట్ చేయడం విమర్శలు తెచ్చింది. పలువురు సెలబ్రెటీలు బ్రాండ్ అండార్స్మెంట్స్ విషయంలో వెనుక ముందు ఆలోచించకుండా ప్రమోట్ చేయడం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ రాజకీయాలనే వణికించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు సినీనటుల పేర్లు తెరమీదకి రావడం చర్చనీయాంశమైంది.

బెట్టింగ్ యాప్స్పై తెలంగాణ పోలీసుల ఫోకస్
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ స్కాం, దానికి ప్రమోషన్ చేసిన సెలబ్రెటీలపై కొద్దిరోజుల క్రితం తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. పలువురు స్టార్స్, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్లు, యాంకర్లపై కేసులు నమోదు చేసింది. వీరిలో పలువురిని స్టేషన్కు పిలిపించి విచారణ కూడా జరిపారు. అప్పట్లో ఈ కేసులు చిత్ర పరిశ్రమలో కలకలం రేపాయి. దీనికి తోడు ఓ యూట్యూబర్ ప్రతిరోజూ బెట్టింగ్ యాప్స్కు ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటీల గురించి బయటపెడుతూ వీడియోలు చేయడం మరింత చర్చనీయాంశమైంది. చట్టవిరుద్ధంగా బెట్టింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకోమని సెలబ్రెటీలు ప్రచారం చేయడాన్ని పలువురు ఖండించారు.
29 మంది సెలబ్రెటీలపై ఈడీ కేసులు
తాజాగా ఈ కేసులోని ఆర్ధిక కోణం నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. 29 మంది సెలబ్రెటీలు, బెట్టింగ్ యాప్ కంపెనీలపై కేసులు నమోదు చేసింది. వీరిలో హీరోలు విజయ్ దేవరకొండ, రానా.. నటుడు ప్రకాష్ రాజ్, మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ.. హీరోయిన్లు నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, ప్రణీత.. యాంకర్లు శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, సిరి హనుమంతు.. వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల.. వసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృతా చౌదరి, నయనిపావని, నేహాపఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, సనీయాదవ్, టేస్టీ తేజ, రీతూ చౌదరి, సుప్రీత బండారు తదితరులు ఉన్నారు.
ఉలిక్కిపడ్డ టాలీవుడ్
వీరందరిపై బీఎన్ఎస్లోని 318(4), 112, రెడ్ విత్ 49తో పాటు తెలంగాణ గేమింగ్ చట్టంలోని 3, 3(ఎ), 4 సెక్షన్లు.. ఐటీ చట్టం 2000, 2008లోని 66డీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్ కేసుపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, విచారణ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు నిర్వహించనుంది. ఈ పరిణామాలతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ వ్యవహారంపై ఈ 29 మంది సెలబ్రెటీలలో ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











