30 వేల రూపాయలతో మా సినిమాని తొక్కేశారు.. బన్నీవాస్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్లో యాక్టీవ్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు బన్నీవాస్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్కి చెందిన గీతా ఆర్ట్స్ వ్యవహారాలు చూసుకుంటూ ఇండస్ట్రీలో కీలకంగా మారారు. గీతా ఆర్ట్స్ వ్యవహారాలు చక్కబెడుతూనే తను కూడా నిర్మాతగా మారి చిన్న చిత్రాలతో తన సత్తా చాటుతున్నారు. ఇటీవలి కాలంలో సినిమాలపై నెగిటివ్ రివ్యూలు, దుష్ప్రచారంపై బన్నీవాస్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నిర్మాణ సారథ్యంలో వచ్చిన ఈషా సినిమాపై వస్తోన్న నెగిటివ్ రివ్యూలపై బన్నీవాస్ సీరియస్ అయ్యారు.
హార్రర్ బ్యాక్డ్రాప్లో నిర్మితమైన ఈషా సినిమాలో హెబ్బా పటేల్, త్రిగుణ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హెచ్వీఆర్ ప్రొడక్షన్ బ్యానర్పై పోతుల హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించగా శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరించారు. వినయ్ రామస్వామి ఎడిటర్గా, ఆర్ఎర్ ధ్రువన్ సంగీత దర్శకత్వం వహించారు. సంతోష్ సనమణి సినిమాటోగ్రఫి అందించారు. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈషా చిత్రం.. అనివార్య కారణాలతో డిసెంబర్ 25న విడుదలైంది. అయితే ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్, రివ్యూలు వస్తుండటంతో చిత్రయూనిట్ హైదరాబాద్లో మీడియా ముందుకొచ్చింది.

చాలా కాంపిటిషన్ మధ్యలో ఈషా సినిమాను రిలీజ్ చేశాం. గతంలో సోషల్ మీడియా, ఏఐ లేనప్పుడు సాంప్రదాయ మీడియా, వెబ్సైట్స్ మాత్రమే. ఆ సమయంలో డిస్కషన్స్ చేసుకుంటూ చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫాం ఉండేది. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు. కానీ ఎక్కడ బాధపడుతున్నామంటే చిన్న ఫార్ములా. ఒక 200 వందల టికెట్స్ని ఎవరో బుక్ చేస్తారు. ఆ తర్వాత రేటింగ్ కొట్టుకుంటూ వస్తే మన సినిమా కిందకి వచ్చేస్తుంది. పొద్దున లేచి మళ్లీ జనాలు కొట్టే వరకు కంగారు.. సినిమా బాగుంటే లేస్తుంది, లేకపోతే 5.5, 5.6 వరకు వచ్చి ఆగిపోతుంది. ఇది కేవలం ఒక ప్రీమియర్ షో ద్వారా అవతలి వాళ్లు మనల్ని బుక్ మై షోలో పడేయాలని అనుకుంటే 300 నుంచి 400 టికెట్లు .. అంటే 30 వేల నుంచి 50 వేల రూపాయలు ఖర్చు చేస్తే చాలు అని బన్నీ వాస్ వ్యాఖ్యానించారు.
ఆ రేటింగ్ని కొలమానంగా తీసుకుంటారు చాలామంది. రివ్యూయర్స్ రాసేవాళ్లు సినిమా చూసి విశ్లేషణ రాస్తారు. అది కొన్నిసార్లు పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు అది ఏదైనా పర్లేదు. ఎందుకంటే రివ్యూయర్స్కి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటది. కానీ ఎలాంటిది లేకుండా రేటింగ్ తగ్గించేసే వాళ్లని ఏం చేయగలం. జనాలు సినిమా చూసి రేటింగ్ పెరిగితే ఓకే.. లేదు ఈవినెంగ్ వరకు రేటింగ్ పెరగకపోతే మనం యాక్సెప్ట్ చేసేయాల్సిందేనని దాముగారితో చెప్పా. ఇప్పుడు 7.5, 7.6 వరకు వెళ్తోంది.. ఇంకా బాగుంటే అది 8.6 వరకు వెళ్లొచ్చు. టెక్నికల్గా ఏ మాత్రం వాల్యూ లేని రేటింగ్ గురించి గతంలోనూ మాట్లాడాను. రేటింగ్ పెట్టాలంటే దానికి కొన్ని కొలమానాలు ఉన్నాయి. 300 టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లు నెగిటివ్గా కొడితే.. దానిని సరి చేయాలంటే మరో 300 టికెట్స్ కొన్నవాళ్లు పాజిటివ్గా కొట్టాల్సి ఉంది అని బన్నీవాస్ తెలిపారు.
సినిమా బాలేదంటే ఇప్పుడు 2.35 పర్ అవర్ వెళ్తోంది. ఇది మామూలు విషయం కాదు. హాలిడే తీసేస్తే.. రేపు కూడా బుకింగ్స్ ఈ స్థాయిలో జరగవు కదా. సినిమా డీసెంట్గా వెళ్తోంది. మంచి సినిమాను సోషల్ మీడియాలో అటో ఇటో తోసేస్తున్నారు. మాతో పాటు రిలీజైన అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నాం.. కానీ కర్మ సిద్ధాంతం వదిలిపెట్టదు. ఈ రోజు కనుక మీరు ఏదైనా చేస్తే, అది ఎప్పుడు ఎలా తగులుతుందో చెప్పలేం. మా సినిమాకు కలెక్షన్స్ వచ్చినా రాకపోయినా మాకు డబ్బు పోతుందేమో... కానీ ఈ సినిమా కోసం కష్టపడిన వారి కెరీర్కు ఎఫెక్ట్ అవుతుంది. నెగిటివ్ క్యాంపెయిన్ గురించి సీనియర్ జర్నలిస్ట్లు అవగాహన కల్పించాలి అని బన్నీవాస్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











