100 కోట్ల బ్యాంక్ స్కాం.. ఈడీ ముందుకు అల్లు అరవింద్.. అసలేం జరిగిందంటే?
తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. పలు నిర్మాణ సంస్థలు, నిర్మాతలు, స్టార్స్ ఇంటిపై ఈడీ దాడులకు దిగడంతో పాటు సూపర్స్టార్ మహేశ్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయడం దుమారం రేపింది. సురానా గ్రూప్కు సంబంధించిన ఓ స్థిరాస్థి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడంపై అప్పట్లో ఆయనపై ఈడీ నోటీసులు జారీ చేసింది. తాజాగా టాలీవుడ్ను శాసించే వ్యక్తుల్లో ఒకరైన అల్లు అరవింద్ ఈడీ ఎదుట హాజరుకావడం చర్చనీయాశంశమైంది. అసలు అల్లు అరవింద్ ఎందుకు ఈడీ ఎదుట హాజరయ్యారు? ఏం జరిగింది? ఈ వివరాల్లోకి వెళితే..
నిర్మాతగా సక్సెస్ కొట్టిన అల్లు అరవింద్
దిగ్గజ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమారుడు, మెగాస్టార్ చిరంజీవికి స్వయానా బావమరిది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గానే కాకుండా పలు వ్యాపారాలతో టాలీవుడ్లో విజయవంతమైన బిజినెస్మెన్గా అరవింద్ పేరు తెచ్చుకున్నారు. అల్లు రామలింగయ్య బాటలో నటుడిగా కాకుండా నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు అరవింద్. పక్కా ప్లానింగ్తో, ఎక్కడా తన పట్టు చేజారిపోకుండా గీతా ఆర్ట్స్ బ్యానర్పై సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఆయన ఎదిగారు.

మెగా ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా
తన ప్రస్థానంలో చిరంజీవితో ఎక్కువగా సినిమాలు తీసిన ఆయన.. మెగా-అల్లు కుటుంబానికి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నారు. చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీని హీరోల ఎదుగుదల వెనుక కీలకపాత్ర పోషించారు. చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ వెనుక మాస్టర్ మైండ్ అరవిందే అని ఫిలింనగర్లో ఇప్పటికే కథలు కథలుగా చెప్పుకుంటారు. భవిష్యత్తులో ఓటీటీ రంగం .. సినిమా వ్యాపారాన్ని డిసైడ్ చేస్తుందని ఊహించి ఆహా పేరుతో ఓటీటీని నెలకొల్పి విజయవంతంగా నడిపిస్తున్నారు. అల్లు అరవింద్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానితో లాభం రాకుండా ఏం చేయరని ఇండస్ట్రీలో వినిపించే మాట. అలాంటి అరవింద్ ఓ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరు కావడం చర్చనీయాంశమైంది.
రామకృష్ణ ఎలక్ట్రానిక్స్లో 100 కోట్ల స్కాం
2018 సమయంలో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీలో 100 కోట్ల రూపాయల స్కామ్ వెలుగు చూసింది. ఓపెన్ క్యాష్ క్రెడిట్ సౌకర్యాన్ని దుర్వినియోగం చేసి.. ఈ కంపెనీలోని వ్యక్తులు ఏకంగా 100 కోట్ల రూపాయలను తమ వ్యక్తిగత ఖాతాలకు బదలాయింపు జరిపారని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసు పెట్టింది. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రానిక్స్ సంస్థల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉన్న పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అలాగే హైదరాబాద్, ఢిల్లీ, ఘజియాబాద్, కర్నూలు నగరాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి .. ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు కోటి 45 లక్షల రూపాయల నగదును సీజ్ చేసింది.
ఈడీ ఎదుట అల్లు అరవింద్
7 ఏళ్ల నాటి ఈ కేసుకు సంబంధించి తాజాగా అల్లు అరవింద్ను విచారణకు రావాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయడంతో ఆయన హాజరయ్యారు. దాదాపు 3 గంటల పాటు ఈడీ అధికారులు ఆయనను పలు విధాలుగా ప్రశ్నించారు. బ్యాంక్ లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లపై ఆరా తీసినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. కేసు విచారణలో భాగంగా తిరిగి వచ్చేవారం విచారణకు హాజరు కావాల్సిందిగా అల్లు అరవింద్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సూచించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











