Tollywood Drugs Case: దూకుడు పెంచిన ఈడీ.. రంగంలోకి ఇంటర్పోల్.. అదే అయితే వరుస అరెస్టులు!
టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ కేసు ముగిసిపోయింది అని అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది అని చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు ఇంటర్పోల్ కూడా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటీనటులకు చిక్కులు తప్పవని అంటున్నారు విశ్లేషకులు. వివరాల్లోకి వెళితే

మళ్ళీ తెరమీదకు
టాలీవుడ్ ఇండస్ట్రీలో సుమారు మూడేళ్ల క్రితం ఈ డ్రగ్స్ కేసు తెరమీదకు వచ్చింది. అప్పట్లో పెను సంచలనాలు కూడా కారణమైన ఈ కేసును సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ఎక్సైజ్ శాఖ అప్పట్లో వరుసగా విచారణ కూడా జరిపింది. టాలీవుడ్ కి సంబంధించిన కీలక వ్యక్తులను అప్పట్లో విచారణ జరిపి వారి రక్తం, గోళ్ళు, జుట్టు వంటి నమూనాలు కూడా తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కి టెస్ట్ నిమిత్తం పంపారు. ఆ టెస్ట్ లో ఎలాంటి ప్రతికూల నివేదికలో రాకపోవడంతో వీరికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.

ఆ విషయం మీదనే ఫోకస్
అయితే ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ పనితీరు బాగా లేదని పేర్కొంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ హైకోర్టుకు ఎక్కడంతో మళ్లీ ఈ వ్యవహారం మొదటికి వచ్చినట్లయింది. తాజాగా ఈ వ్యవహారంలోకి రంగంలోకి దిగిన డైరెక్టరేట్ అధికారులు ఇప్పుడు ఇంటర్పోల్ సహాయం కూడా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. విదేశాలకు నిధుల తరలింపు విషయంలో కూడా ఇప్పుడు టాలీవుడ్ నటీనటులను విచారణ జరిపే అవకాశం ఉందని అంటున్నారు.

లెక్క తేల్చే అవకాశం
ఈ వ్యవహారంలో ఇప్పటికే డ్రగ్ పెడలర్స్ కెల్విన్. కమింగా, విక్టర్ అనే ముగ్గురు నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.. విదేశీ బ్యాంకు ఖాతాల్లో డబ్బు ఇక్కడి నుంచి ఎంత తరలిపోయింది అనే విషయాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు లెక్క తేల్చే అవకాశం కనిపిస్తోంది. ఇంటర్పోల్ సహాయంతో విదేశీ బ్యాంకు అకౌంట్లలో ఇక్కడి నుంచి నగదు ఎలా జమ చేశారు అనే విషయాన్ని గుర్తించనున్నట్లు తెలుస్తోంది.

విదేశాలకు భారీగా డబ్బు
ఇప్పటికే పలువురు సినీ తారలకు ఏ రోజు విచారణకు రావాలి అనే అంశానికి సంబంధించి నోటీసులు జారీ చేయగా ఈ పన్నెండు మందిని విచారించిన తర్వాత మరికొంత మందికి అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం విదేశాలకు భారీగా డబ్బులు తరలించి మరి డ్రగ్స్ అక్కడి నుంచి దిగుమతి చేసుకున్నట్లు గా ఆధారాలు లభించాయి. గతంలో ఈ విచారణ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ రిపోర్టులో కూడా ఈ వ్యవహారాన్ని పేర్కొన్నట్లుగా చెబుతున్నారు.

ఇంటర్పోల్ సహాయం
నేరుగా ఖాతాలకు వేసిన మొత్తం కొంత అయితే మరికొంత మాత్రం హవాలా మార్గంలో తరలించి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎవరెవరు ఖాతా నుంచి ఎంత చెల్లించారు అనే విషయాలను కూడా ఇపుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే ఈ డబ్బును విదేశాల్లో ఉన్న ఎవరికి ఖాతాల్లోకి ఎంతమేరకు మళ్ళించారు అనే విషయం మీద కూడా ఇంటర్పోల్ సహాయం కోరినట్టు చెబుతున్నారు ఇంటర్పోల్ అధికారుల ద్వారా అక్కడి అధికారులను సంప్రదించి సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారని అంటున్నారు.

చెల్లింపులన్నీ ఆన్లైన్ లో
డ్రగ్స్ దిగుమతి కి సంబంధించిన చెల్లింపుల మూలాలను బయటికి తీయనుందని అంటున్నారు. అమెరికా, ఆస్ట్రియ, దక్షిణాఫ్రికా దేశాలనుండి కొరియర్ ల ద్వారా డ్రగ్స్ దిగుమతి చేసుకున్నారని, చెల్లింపులన్నీ ఆన్లైన్ లో జరిగినట్లు ఆధారాలు సేకరించారు. అంతే కాక విదేశాల్లో ఉన్న డ్రగ్ మాఫియా ఖాతాల్లోకి ఇక్కడ నుండి నగదు బదిలీ జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు.


Click it and Unblock the Notifications











