కళ్ల ముందే బ్యాలెట్లు ఎత్తుకుపోయారు.. ఎవడైతే నాకేంటీ, మోహన్ బాబుపై ఈటీవీ ప్రభాకర్ సంచలనం
తెలుగు బుల్లితెరపై దశాబ్ధాలుగా వినోదాన్ని అందిస్తూ ఎందరో నటీనటులు వారి జీవితంలో భాగమయ్యారు . ఇలాంటి వారిలో ప్రభాకర్ ఒకరు. ఏళ్లుగా ఎన్నో సూపర్హిట్ సీరియల్స్లో, సినిమాలలో నటిస్తూ తనకంటూ గుర్తింపు, గౌరవం తెచ్చుకున్నారు. తనకు నటుడిగా జీవితాన్ని ఇచ్చిన ఈటీవీనే ఇంటిపేరుగా మార్చుకున్నారాయన. ప్రభాకర్ అంటే ఎవరూ టక్కున గుర్తుపట్టకపోవచ్చేమో కానీ ఈటీవీ ప్రభాకర్ అంటే ఎవరికైనా గుర్తొస్తారు. ఆయన జీవితంలో మా ఎన్నికలు ఒక గుణపాఠంగా మిగిలాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాడు జరిగిన ఘటనలను గుర్తుచేసుకున్నారు ఈటీవీ ప్రభాకర్.
టీవీ ఇండస్ట్రీలో బుల్లితెర మెగాస్టార్ అని ప్రభాకర్ను అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఈటీవీ అప్పుడప్పుడే నడక ప్రారంభించిన కొత్తలో రామోజీరావు కుమారుడు సుమన్ , ప్రభాకర్ చాలా క్లోజ్గా ఉండేవాళ్లు. తన తండ్రి మాట కంటే ప్రభాకర్కే సుమన్ ఎక్కువ విలువనిచ్చే వారని ఇప్పటికీ ఫిలింసిటీలో చెవులు కొరుక్కుంటూ ఉంటారు. అయితే ఈటీవీ నిర్వహణలో ప్రభాకర్ జోక్యం చేసుకున్నారనే వాదనలు కూడా అప్పట్లో వినిపించాయి. ఈ క్రమంలోనే దివంగత రామోజీరావు ఆగ్రహానికి ప్రభాకర్ గురయ్యారని.. అందుకే ఈటీవీ నుంచి ఆయనను తప్పించారని ఇప్పటికీ కథకథలుగా చెప్పుకుంటారు.

ఈటీవీ నుంచి తప్పుకున్నా.. జెమినీ, మాటీవీ, జీ తెలుగు వంటి సంస్థలలో ప్రభాకర్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ.. ఇప్పటికీ నటిస్తున్నారు. తన కొడుకు చంద్రహాస్ను హీరోగా పరిచయం చేశారు. ఎలాగైనా కొడుక్కి బ్రేక్ ఇవ్వాలని ప్రభాకర్, మలైజాలు సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా సొంతంగా బ్యానర్ ఓపెన్ చేసి 'రామ్ నగర్ బన్నీ ' అనే సినిమా నిర్మించారు. శ్రీనివాస్ మహత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్గా నిలిచింది.
అయితే జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సహా కొన్ని సినిమాల కారణంగా తమ సినిమాపై గట్టి ప్రభావం పడిందని ఈటీవీ ప్రభాకర్ అన్నారు. ఇటీవల ఓ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకున్నారు. తన కళ్ల ముందే బ్యాలెట్లు తీసుకెళ్లిపోతున్నారని.. అసెంబ్లీ ఎన్నికల కంటే ఘోరంగా మా ఎన్నికలు జరిగాయని ప్రభాకర్ పేర్కొన్నారు. మోహన్ బాబు మాట్లాడే బూతులకు తన మండిపోయిందని.. తప్పు చేస్తే ఎవరైనా, ఎదురుగా ఎంత పెద్దోడు ఉన్నా ప్రశిస్తానని ఆయన స్పష్టం చేశారు.
మంచు మనోజ్ చాలా వరకు గొడవలు జరగకుండా చూసుకున్నారని.. విష్ణు ఒక మోనార్క్ అని , తాను అనుకున్నదే జరగాలని అనుకునే టైప్ అని ప్రభాకర్ ఆరోపించారు. టెలివిజన్ ఇండస్ట్రీలో జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్గా చేసిన అనుభవంతో సినీ కళాకారులకు తాను ఏమైనా చేయగలనన్న నమ్మకంతో ప్రకాష్ రాజ్ ప్యానెల్ తనను సంప్రదించిందని చెప్పారు. ఈసీలో ఐదుగురుం సహా మొత్తం 12 మంది గెలిచామని ప్రభాకర్ తెలిపారు.
డామినేషన్, చెత్త, చెదారం లాగా అనిపించిందని.. గెలిపిస్తే ఒకే ప్యానెల్ మాదిరిగా గెలిపించాలని, అటు సగం , ఇటు సగం వద్దని తాను ఎన్నికల ముందు నుంచే చెప్పానని ప్రభాకర్ అన్నారు. మోహన్బాబుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన తనకు అభిమాన నటుడని , ఇంత గొడవ జరిగినా ఆయనతో ఫోటో దిగడానికి వెళ్లానని ప్రభాకర్ చెప్పారు. ఆ దెబ్బతో ఇక మా వైపు కన్నెత్తి కూడా చూడలేన్నారు. ప్రస్తుతం ప్రభాకర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











