విరాట పర్వంలో సాయిపల్లవి పోషించిన పాత్ర ఎవరో తెలుసా? తూము సరళ వాస్తవ కథను చెప్పి సోదరుడు ఎమోషనల్
విరాట పర్వం సినిమాలో సాయిపల్లవి పోషించిన వెన్నెల పాత్ర గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలోను, యూట్యూబ్లో విపరీతమైన చర్చ జరుగుతున్నది. 90వ దశకం తొలినాళ్లలో
తూము సరళ అనే యువతి పీపుల్స్ వార్ ఉద్యమాల నుంచి స్పూర్తి పొంది దళంలో చేరేందుకు వెళ్లి అనుకొని పరిస్థితుల్లో దళ నాయకుడు చేతిలో మరణించడం అప్పట్లో సంచలనం రేపింది. అయితే ఈ సంఘటనతో సంబంధం ఉన్న వ్యక్తులు తమకు తోచిన విధంగా మాట్లాడటం అనేక వివాదాలకు తావిచ్చింది. దాంతో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు విరాట పర్వం టీమ్ మీడియాతో ముచ్చటించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు వేణు ఊడుగుల, నిర్మాత డీ సురేష్ బాబు, సాయిపల్లవి, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, సరళ సోదరుడు తూము మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తూము మోహన్ రావు మాట్లాడుతూ..

ప్రివ్యూకు పిలిస్తే నో చెప్పా
90వ దశకంలో అంటే 30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను తీసుకొని దర్శకుడు వేణు ఊడుగుల విరాట పర్వం సినిమాను రూపొందించడం చాలా హ్యాపీగా ఉంది. కొద్ది నెలల క్రితం వేణు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అంతకు ముందు మమల్ని కలవడానికి వీలు పడలేదో.. లేక మేము ఆయనకు అందుబాటులో లేమో.. మమ్మల్ని కలువలేకపోయారు. అయితే ఇటీవల సినిమా పూర్తయిన తర్వాత ప్రివ్యూకు పిలిచారు. కానీ నేను ప్రేక్షకుడిలానే థియేటర్కు వెళ్లి చూస్తానని చెప్పాను. విరాటపర్వం సినిమాను కేవలం సినిమాగానే చూశాను అని తూము మోహన్ రావు చెప్పారు.

సరళ మరణం వెనుక అనేక కథనాలు
విరాట పర్వం సినిమా రిలీజ్ తర్వాత జర్నలిస్టు మిత్రుడు ఫోన్ చేసి.. క్లైమాక్స్ అలా జరగలేదుంట.. అని అడిగాడు. అయితే వాస్తవంగా ఏం జరిగిందో మీకు తెలుసా?.. ఒకవేళ మీకు తెలిస్తే.. మాకు చెప్పండి అని అడిగాను. అయితే ఆయన వద్ద సమాధానం లేదు. మా చెల్లెలు చనిపోయిన తర్వాత చాలా విషయాలు మేము తెలుసుకొన్నాం. అయితే ఈ సినిమా కోసం వేణు ఉడుగుల చాలా పరిశోధన చేశారు. చాలా విషయాలు మాకంటే ఎక్కువ తెలుసుకొన్నారు. ఆ విషయాల ద్వారా సినిమాను తెరకెక్కించారు అని మోహన్ రావు అన్నారు.

వాస్తవ కథకు.. సినిమా కథకు తేడా అదే..
విరాట పర్వం సినిమా క్లైమాక్స్ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు. వాస్తవంగా ఏం జరిగిందో.. అదే చూపించారు. అయితే ప్రేమ కథ విషయానికి వస్తే.. సినిమాలో మరో కోణంలో చూపించారు. సినిమా కథ విషయానికి వస్తే.. రవన్న అనే నక్సలైట్ నాయకుడి రచనలు చదివి దళంలో చేరాలని అనుకొన్నారు. అయితే వాస్తవానికి నా సోదరి సరళ ఉద్యమాన్ని, వామపక్ష భావజాలాన్ని ప్రేమించింది. ఆ ప్రేమ కారణంగానే దళంలో చేరాలని అనుకొన్నది అని మోహన్ రావు చెప్పారు.

శంకరన్న తప్పుడు నిర్ణయాలకు
నా సోదరి సరళ సమాజంలో విప్లవం రావాలని వెళ్లింది. విప్లవం కోసం చనిపోయింది. విప్లవం కారణంగానే చనిపోవడం దారుణమైన విషయం. దళ సభ్యులు, దళ నాయకుడు శంకరన్న తప్పుడు నిర్ణయాలకు నా చెల్లెలు బలి అయ్యారు. ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో మేము అదే చెప్పాం. ఇప్పుడు అదే చెబుతున్నాం అని తూము మోహన్ రావు అన్నారు.

శంకరన్న పాత్రను పాజిటివ్గా
విరాట పర్వం సినిమాలో మ్యూజిక్ బాగా నచ్చింది. మా ఫ్యామిలీ మెంబర్స్ సురేష్ బొబ్బిలి అందించిన మ్యూజిక్ను ఇష్టపడ్డారు. సాయిపల్లవి, రానా లేకపోతే ఈ సినిమా లేదు. ఈ ఇద్దరిని ఎంపిక చేసుకోవడం దర్శకుడు వేణు ఊడుగుల సినిమాపై ఉన్న నిబద్దతకు, అంకితభావానికి అద్దం పట్టింది. అయితే రానా పోషించిన పాత్ర వాస్తవ జీవితంలో శంకరన్నది. ఈ ఎపిసోడ్లో శంకరన్న తీసుకొన్న నిర్ణయం మాకు నచ్చలేదు. శంకరన్నను సినిమాలో పాజిటివ్గా చూపించారు. అదొక్కటే మాకు ఇబ్బందికరంగా అనిపించింది అని తూము మోహన్ రావు తెలిపారు.


Click it and Unblock the Notifications











