Gaddar No More: ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత.. సినీ రంగంలోనూ సంచలనమే
ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలోనే పరిశ్రమతో సంబంధం ఉన్న ఎంతో మంది నటులు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్లు పలు కారణాలతో మృతి చెందారు. ఈ క్రమంలోనే ఇప్పుడు చిత్రసీమలో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. తెలుగు సినిమాలతో సంబంధం ఉన్న ప్రముఖ రచయిత, ప్రజా గాయకుడు గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్ రావు (74) తాజాగా కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు.
ప్రముఖ గేయ రచయిత, సీనియర్ సింగర్ గద్దర్ కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఆయన గుండెపోటు కారణంగా హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కోలుకున్న గద్దర్కు ఇటీవలే ఓ సర్జరీ కూడా చేశారు. అంతా బాగుంది అనుకున్న సమయంలోనే ఆయన ఆరోగ్యం మరోసారి విషమించింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాసను విడిచారు. ఈయన మరణంపై రాజకీయ నాయకుడు, సినీ ప్రముఖులు ఇతర రంగాలకు చెందిన వాళ్లంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్ రావు మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో 1949లో జన్మించారు. ఆయన నిజామాబాద్, మహబూబ్నగర్, హైదరాబాద్లో విద్యభ్యాసం పూర్తి చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో తనదైన పాటలతో ఎంతో మందిని చైతన్యవంతం చేశారు. మలి తెలంగాణ ఉద్యమంలో సైతం గద్దర్ తనదైన పాత్రను పోషించారు.
గద్దర్ 'మాభూమి' సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రతో సినీ రంగ ప్రవేశం చేశారు. అందులో 'బండెనక బండి కట్టి' అనే పాటను ఆయనే పాడి, ఆడారు. అలాగే, 'ఒరేయ్ రిక్షా' సినిమాలో 'నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా' అనే పాటను రాశారు. దీనికి నంది అవార్డు కూడా వచ్చింది. కానీ, దీన్ని ఆయన తిరస్కరించారు. ఆ తర్వాత చాలా రోజులకు 'జై బోలో తెలంగాణ' సినిమాలో 'పొడుస్తున్న పొద్దు మీద' పాటను రాసి ఆలపించారు. దీనికి సైతం నంది అవార్డు లభించింది.


Click it and Unblock the Notifications











