వ్యాన్లో ప్యాంట్ విప్పి జిప్ తీసి... బాధితురాలిపై జానీ మాస్టర్ అరాచకం
సౌత్లో ఫేమస్ కొరియోగ్రాఫర్గా వెలుగొందుతున్న జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం దుమారం రేపుతోంది. ఇప్పటికే ఆయనపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో సంచలన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు నేపథ్యంలో ప్రస్తుతం బాధితురాలు ఎవరు, ఆమె జానీ మాస్టర్కు ఎలా పరిచయమైంది అనే అంశాలను ఆరా తీస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఓ షో కోసం జానీ మాస్టర్కు ఓ షో ద్వారా బాధితురాలు పరిచయమైనట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్లో తెలిపారు. ఈ క్రమంలోనే ఓ రోజున ఆయన అనుచరులు బాధితురాలికి ఫోన్ చేసి జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్గా పనిచేసే అవకాశం వచ్చినట్లుగా చెప్పారు. దీంతో సంబరపడిన యువతి 2019 నుంచి జానీ మాస్టర్ బృందంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉంటోందని పోలీసులు ఎఫ్ఐఆర్లో వెల్లడించారు. అయితే ఓ షో కోసం జానీ మాస్టర్ అండ్ టీమ్ ముంబైకి వెళ్లగా వీరిలో బాధితురాలు కూడా ఉన్నట్లు చెప్పారు.

ఆ సమయంలో వీరంతా ఓ హోటల్లో బస చేయగా.. అక్కడే జానీ మాస్టర్ ఈమెపై అత్యాచారానికి పాల్పడినట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని బయట ఎవరికీ చెప్పొద్దని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. షూటింగ్ సమయంలోనూ ఆమె పట్ల జానీ మాస్టర్ అసభ్యంగా వ్యవహరించినట్లుగా ప్రచారం జరుగుతోంది. మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని పలుమార్లు ఆమెను బలవంతం చేసినట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
ఎంతగా ఒత్తిడి తెచ్చినా వినకపోవడంతో జానీ మాస్టర్ ఓ రోజున బాధితురాలి జుట్టుకుని కొట్టాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాపై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. తొలుత రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదవ్వగా.. ఘటన జరిగింది నార్సింగి పరిధిలో కావడంతో అక్కడికి బదిలీ చేశారు.

లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో జానీ మాస్టర్పై జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీలో ఆయన క్రియాశీలకంగా పనిచేస్తుండటంతో ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని వేములపాటి అజయ్ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. ప్రస్తుతం జానీ మాస్టర్ వ్యవహారం తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
అయితే జానీ మాస్టర్పై ఆరోపణలకు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. తన కోరిక తీర్చకుంటే ఇండస్ట్రీలో ఒక్క ఆఫర్ కూడా రాకుండా చేస్తానని బెదిరించినట్లుగా బాధిరాలు ఆరోపిస్తోంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో నా వ్యాన్లోకి వచ్చి.. తన ప్యాంట్ జిప్ తీసి నాపై బలాత్కారం చేయబోయినట్లుగా బాధితురాలు పేర్కొంది. తాను తీవ్రంగా ప్రతిఘటించడంతో నా తలను అద్దంకేసి కొట్టాడని బాధితురాలు చెప్పినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. మణికొండలోని నా ఫ్లాట్కు అర్థరాత్రులు వచ్చి.. కోరిక తీర్చమని చాలాసార్లు దాడి చేశాడని ఆరోపించింది. ప్రస్తుతం జానీ మాస్టర్ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











