Anchor TNR is no more: టాలీవుడ్లో మరో విషాదం! కరోనాతో ప్రముఖ జర్నలిస్టు కన్నుమూత!
ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎంతో మంది పలు రకాల కారణాలతో మృతి చెందారు. ఇక, కొంత కాలంగా కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చుతుండడంతో పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కూడా మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ సినీ జర్నలిస్టు, నటుడు టీఎన్నార్ (తుమ్మల నరసింహారెడ్డి) కరోనా కారణంగా మృతి చెందారు. ఆయన మరణంతో ఇండస్ట్రీలో విషాదం అలముకుంది.
ప్రముఖ యాట్యూబ్ ఛానెల్లో వచ్చే 'Frankly With TNR Show' ద్వారా పాపులర్ అయిన టీఎన్నార్ (తుమ్మల నరసింహారెడ్డి)కు కొద్ది రోజుల క్రితం కరోనా సోకింది. దీంతో అప్పటి నుంచి ఆయన నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్సను తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆయన పరిస్థితి విషమించింది. పల్స్ రేటు బాగా పడిపోవడంతో పాటు కోమా స్టేజ్లోకి వెళ్లారని ప్రచారం జరిగింది. దీంతో అప్పటి నుంచి టీఎన్నార్కు అక్కడి వైద్యులు మరింత మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. కానీ, సోమవారం ఉదయం ఆయన తుది శ్వాసను విడిచారు.

దర్శకుడు అవ్వాలనుకుని హైదరాబాద్లో అడుగు పెట్టిన టీఎన్నార్ (తుమ్మల నరసింహారెడ్డి) ఫిల్మ్ జర్నలిస్టుగా ఫేమస్ అయ్యారు. ఇక, ఈ మధ్య కాలంలోనే పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును అందుకున్నారు. అంతేకాదు, త్వరలోనే ఓ సినిమాను రూపొందించేందుకు ప్రయత్నాలు కూడా జరుపుతున్నట్లు ఆయన సన్నిహితులు తెలియజేశారు. ఇలాంటి సమయంలో కరోనా రక్కసి కారణంగా ఆయన ప్రాణాలను కోల్పోయారు. టీఎన్నార్ మరణంపై సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











