ప్రముఖ సినీ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి కన్నుమూత.. పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతి
సీనియర్ పాత్రికేయు లు, ప్రముఖ సినీ విమర్శకుడు గుడిపూడి శ్రీహరి (88) ఇకలేరు. వృద్దాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో సినీ పాత్రికేయ వర్గాలు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. శ్రద్దాంజలి ఘటించారు.
గుడిపూడి శ్రీహరి కెరీర్ విషయానికి వస్తే.. ఈనాడు, సితార, హిందూ, ఫిల్మ్ఫేర్ తదితర పత్రికలకు సినిమా, సాంస్కృతిక రంగాలకు సంబంధించిన వార్తలు, వ్యాసాలు రాశారు. వందలాది సినిమా సమీక్షలు రాసిన ఆయన పాఠకుల అభిమానాన్ని చూరగొన్నారు. కేవలం పాఠకులే కాకుండా సినీ ప్రముఖులు కూడా ఆయన సమీక్షల కోసం ఎదురు చూసేవారు. తన పాత్రికేయ జీవితంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకొన్నారు.

గత నవంబర్లో భార్య శ్రీమతి లక్ష్మీ మరణించిన తర్వాత గుడిపూడి శ్రీహరి మానసికంగా కుంగిపోయారు. దాంతో ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. అయితే గతవారం ఇంట్లో పడిపోవడంతో కాలి ఎముక విరిగింది. దాంతో నిమ్స్ హాస్పిటల్లో చేర్పించగా ఆపరేషన్ సక్సెస్ఫుల్గా నిర్వహించారు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా పరిస్థితి విషమించడంతో మరణించారు.
గుడిపూడి శ్రీహరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారి కుమారుడు శ్రీరాం విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన తర్వాత అంత్యక్రియలు జరుగుతాయి అని సన్నిహితులు తెలిపారు.
గుడిపూడి శ్రీహరి మరణంపై సినీ క్రిటిక్స్ అసోసియేషన్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన మరణంతో తెలుగు సినీ పాత్రికేయ రంగం పెద్ద దిక్కుని కోల్పోయింది.. ఇది తీరని లోటు. వారికి సద్గతులు లభించాలి అని ఓ ప్రకటనలో తెలిపారు.
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. పాత్రికేయ రంగంలో... ప్రత్యేకించి సినిమా జర్నలిజంలో విశేష అనుభవం కలిగిన శ్రీ గుడిపూడి శ్రీహరి గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. తెలుగు, ఆంగ్ల పత్రికల్లో సినీ విమర్శకుడిగా శ్రీహరి గారు రాసిన వ్యాసాలు, సినిమా రివ్యూలు ఎంతో ఆసక్తిని రేకెత్తించేవి. తెలుగు చిత్రసీమ ప్రస్థానంలోని అనేక ముఖ్య ఘట్టాలను ఆయన అక్షరబద్ధం చేశారు. సినిమాతోపాటు వర్తమాన రాజకీయ, సామాజిక పరిణామాలపై 'హరివిల్లు' శీర్షికతో చేసిన వ్యంగ్య రచనలు ఆయన నిశిత పరిశీలన తెలిపేవి. శ్రీ గుడిపూడి శ్రీహరి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు.


Click it and Unblock the Notifications











