Sai Ram putta Death: అలా జరగడంతోనే సాయిరామ్ మృతి.. అండగా నిలబడతామంటూ ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రకటన!
కళ్యాణ్ రామ్ హీరోగా రుపొందిన బింబిసార సినిమా ఆగస్టు 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో శిల్పకళా వేదికలో నిర్వహించారు. అయితే అక్కడే ఒక అభిమాని మృతి చెందిన ఘటన ఇప్పుడు షాక్ కలిగిస్తోంది. ఎన్టీఆర్ అభిమాని మృతి చెందిన విషయం మీద తాజాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ అధికారికంగా స్పందించింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

బింబిసార
కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట మల్లిడి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం బింబిసార. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్, కేథరిన్ థెరిసా, వరీనా హుస్సేన్ వంటి వారు కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాను తమ సొంత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ కొసరాజు నిర్మించారు. ఇక ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందించగా కీరవాణి నేపథ్య సంగీతం అందించారు, ఫేమస్ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.

శిల్పకళా వేదికలో
అక్కడిదాకా బాగానే ఉంది కానీ తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించారు. ఈ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అయితే ఎన్టీఆర్ హాజరవుతూ అవుతూ ఉండడంతో నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున ఈవెంట్ కు హాజరవ్వడానికి ప్రయత్నించారు. పాసులు దొరికిన వారు లోపలికి వెళ్లారు దొరకని వారు వెను తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దురదృష్టకరమని
అయితే తాజాగా పుట్టా సాయిరాం అనే ఒక అభిమాని మృతి చెందడంతో ఈ విషయం మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తమకు ఒక అభిమాని మృతి చెందారనే విషయం ఆలస్యంగా తెలిసిందని దీనిపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెం సమీపంలోని పెంటపాడు మండలానికి చెందిన పుట్టా సాయిరాం సన్ ఆఫ్ రాంబాబు నందమూరి కుటుంబానికి వీరాభిమాని అని ఆయన బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి కన్నుమూయడం దురదృష్టకరమని పేర్కొంది.

ఫిట్స్ రావడంతో
ఆయన కుటుంబానికి తమకు సాధ్యమైన అన్ని విధాలుగా అండగా నిలబడతామని కూడా పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తాజాగా వెల్లడవుతున్నాయి. ఆయన కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ఫ్యాన్స్ ద్వారా పాస్ సంపాదించి ఈవెంట్ కు హాజరయ్యారని, అయితే ఈవెంట్ జరుగుతున్న సమయంలోనే ఆయనకు ఫిట్స్ రావడంతో హుటాహుటిన గాంధీ హాస్పిటల్ కి తరలించారు అని అంటున్నారు. అయితే అక్కడికి తరలించిన తరువాత ఆయన కన్ను మూసినట్లుగా తెలుస్తోంది.

అండగా ఉంటామని
నిజానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అలాగే స్థానిక పోలీసులు కూడా భారీ ఎత్తున అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఆయనకు ఫిట్స్ రావడంతో అనుకోని పరిస్థితుల్లో మరణం సంభవించింది అని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని ముందుకు వస్తున్నారు. దీనికి సంబంధించి మాత్రం పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











