అర్జునుడు, శ్రీకృష్ణుడు విలన్లా? కల్కి 2898 AD సినిమాపై గరికపాటి షాకింగ్ కామెంట్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పఠానీ లాంటి స్టార్ కాస్టింగ్ భాగమయ్యారు. జూన్ నెలాఖరున విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. 2024లో ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రంగా నిలిచింది. అలాంటి సినిమాపై ప్రముఖ వక్త, ప్రవచన కర్త గరికపాటి మండిపడ్డారు.
భారతీయ పురాణాలు, ఇతిహాసాలను ఆధారంగా రూపొందిన ఎపిక్ ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం 'కల్కి 2898 AD'. మహా భారతాన్ని భవిష్యత్ ప్రపంచానికి ముడిపెడుతూ ఆడియన్స్ కు విజువల్ వండర్ ను పరిచయం చేసే ప్రయత్నం చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్. అశ్వత్థామ, కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, ఉత్తర వంటి ఐకానిక్ పాత్రలకు మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. అయితే మహాభారతాన్ని వక్రీకరించి ఈ సినిమాని తీశారని ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు తాజాగా విమర్శించారు. కర్ణుడు, అశ్వథ్థామ పాత్రలను వక్రీకరించి చూపించారని విరుచుకుపడ్డారు.

"కర్ణుడు ఎవరో తెలియకపోతే 'కల్కి' సినిమాలో చూపించిన వాడే కర్ణుడు. మనం ఏం చేస్తాం. సినిమా వాళ్లు ఏం చూపిస్తే అది. మొత్తం భారతంలో ఉన్నది వేరు.. అందులో చూపించింది వేరు. అశ్వత్థామ, కర్ణుడు అర్జెంటుగా హీరోలు అయిపోయారు.. అర్జునుడు, భీముడు, కృష్ణుడు అందరూ విలన్లు అయిపోయారు. ఎలా అయ్యారో మాకు అర్థం కావట్లేదు. బుర్ర పాడైపోతోంది. భారతం చాలా చదివితే అర్థం అవుతుంది కర్ణుడినే అశ్వత్థామ కాపాడారు. అశ్వత్థామను కర్ణుడు ఒక్కసారి కూడా కాపాడలేదు. అశ్వత్థామకు ఆ అవసరం లేదు. ఎందుకంటే అశ్వత్థామ మహా వీరుడు. ఇక్కడేమో 'ఆచార్య పుత్రా ఆలస్యమైనదా?' అంటూ డైలాగ్ పెట్టారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. మనకు ఏది కావాలంటే అది పెట్టేయడమే. ఓ వెయ్యి రూపాయలు ఎక్కువ డైలాగ్స్ రాసేవాడు అలాంటివి రాసిచ్చేస్తాడు కదా" అంటూ గరికపాటి ఫైర్ అయ్యారు.
గతంలో గరికపాటి 'పుష్ప' సినిమాపై కూడా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఒక స్మగ్లర్ ను హీరోగా చూపించారని, స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదేలే అంటాడా? అంటూ విమర్శించారు. తగ్గేదేలే అనే డైలాగ్ ఒక పెద్ద ఉపనిషత్తు సూక్తి అయిపోయిందని, కుర్రాళ్ళు కూడా ఎవరినైనా గూబ మీద కొట్టి తగ్గేది లేదంటున్నారని అన్నారు. అలాంటి డైలాగ్స్ శ్రీరాముడు, హరిశ్చంద్రుడు వంటి వారు వాడాలని.. ఒక స్మగ్లర్ అలాంటి డైలాగ్ వాడడం ఏంటండి? అని ప్రశ్నించారు.

ఏది సంచలనం చేయాలో అది మానేసి, దుర్మార్గాన్ని దొంగతనాన్ని సంచలనం చేస్తున్నామని విరుచుకుపడ్డారు. సినిమా హీరో, డైరెక్టర్ కనిపిస్తే కడిగి పారేస్తానని హెచ్చరించారు. ఇప్పుడు అదే విధంగా 'కల్కి 2898 AD' సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
'కల్కి 2898 AD' చిత్రంలో బౌంటీ హంటర్ గా, కర్ణుడిగా రెండు పాత్రల్లో ప్రభాస్ కనిపించారు. విష్ణువు అవతారాన్ని మోసే గర్భిణీ స్త్రీగా దీపికా పదుకునే నటించగా, అశ్వత్థామ పాత్రను అమితాబ్ పోషించారు. సుప్రీం యాస్కిన్ గా కమల్ హాసన్ కనిపించారు. అర్జునుడిగా విజయ్ దేవరకొండ, ఉత్తరగా మాళవిక నాయర్ అతిథి పాత్రల్లో మెరిశారు. క్లైమాక్స్ లో ప్రభాస్ ను కర్ణుడి అవతార్ లో చూపించి సెకండ్ పార్ట్ పై ఆసక్తిని కలిగించారు. మరి నాగ్ అశ్విన్ ఈసారి కల్కి పార్ట్-2లో ఎలాంటి కథను చెబుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











