ఇండస్ట్రీలో దారుణ పరిస్థితులు.. వాటి నుంచి బయట పడలేకపోతున్నాం: ది గర్ల్ఫ్రెండ్ నిర్మాత
The Girlfriend movie: రష్మిక మందన్న, దీక్షిత్శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన 'ది గర్ల్ఫ్రెండ్' సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ వరుసగా ప్రమోషన్లలో పాల్గొంటోంది. అయితే ఈ ప్రమోషన్లలో భాగంగా నిర్మాత ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni ) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని ఓ ఇంటర్వ్వూలో మాట్లాడుతూ, "సినిమా తీయడం ఒక భాగం మాత్రమే, కానీ దాన్ని ప్రేక్షకుల ముందుకు సరైన విధంగా తీసుకురావడం మరింత ముఖ్యమైన విషయం" అని స్పష్టంగా తెలిపారు. నేటి డిజిటల్ యుగంలో కేవలం ట్రైలర్ రిలీజ్ లేదా ప్రీ-రిలీజ్ ఈవెంట్లతో సరిపోదని, సోషల్ మీడియా ప్రమోషన్లలో కొత్తదనం, సృజనాత్మకత అవసరమని హితవు పలికారు. "చిన్న నిర్మాతలు సినిమా తీయడానికి డబ్బు పెడతారు కానీ మార్కెటింగ్పై దృష్టి పెట్టరు. సినిమా బాగుంది అనేది సరిపోదు, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి క్రియేటివ్ ప్రణాళిక అవసరం, సినిమా తీయడం కాకుండా దాన్ని ఎలా అమ్ముకోవాలో నేర్చుకోండి." అని సూచించారు.

ఇతర భాషా నటులపై అధిక పారితోషికంపై స్పందన
ఇతర భాషల నటీనటులకు ఎక్కువ రేమ్యునరేషన్ ఇస్తున్నారనే ప్రశ్నకు ధీరజ్ స్పందిస్తూ, "ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటేమిటంటే, వారు ప్రొడ్యూసర్కు అనుకూలంగా పనిచేస్తారు. రెండవది, ఇతర భాషా నటులను తీసుకోవడం వల్ల మన సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది," అని వివరించారు. అలాగే "ఇతర భాష నటులు ఉన్న సినిమాలు థియేటర్ హిట్ కాకపోయినా, ఓటీటీ రిలీజ్లో మంచి వ్యూస్ సాధిస్తాయి. అలా వేరే భాష ప్రేక్షకులూ ఆ సినిమాను చూస్తారు. కాబట్టి ఇది నిర్మాతలకు ప్లస్ అవుతుంది" అని ధీరజ్ మొగిలినేని తెలిపారు.
ప్రొడ్యూసర్ల పరిస్థితి చాలా దారుణం
ఇండస్ట్రీలో నిర్మాతల పరిస్థితి గురించి మాట్లాడుతూ ధీరజ్ మొగిలినేని షాకింగ్ విషయాలను బయటపెట్టారు. "ఇండస్ట్రీలో నిర్మాతల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నిజంగా సినిమా అంటే పిచ్చి. ఆ పిచ్చి, ఆ ఫ్యాషన్ వల్లే సినిమాలు చేస్తున్నాం. ఇప్పటికే జీవితంలో సగం భాగం ఈ ఇండస్ట్రీకే అంకితం చేశాం. అన్ని విషయాలు తెలుసు, ఎన్ని కష్టాలు ఎదురైనా 'ఇది మన జీవితం' అని ఫిక్స్ అయ్యాం. ఇక బయటకు వెళ్లే పరిస్థితి లేదు," అని భావోద్వేగంగా చెప్పారు.
ధీరజ్ మొగిలినేని ఇక మాట్లాడుతూ.. "ఒక సినిమా తీస్తే నాన్-థియేట్రికల్ (సాటిలైట్, ఓటీటీ, డిజిటల్ హక్కులు) రికవరీ చేయడమే కష్టం. సినిమా ప్రమోషన్ చేయడమూ ఒక యుద్ధం లాంటిది. సినిమా ను ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లడం చాలా కష్టం. ఎంత చేసినా, ఆఖరికి 100% రిస్క్ మాత్రం నిర్మాతపైనే ఉంటుంది," అని వివరించారు. "నాన్-థియేట్రికల్ డీల్స్ సెట్ చేయడమే కాదు, థియేటర్ రన్ కూడా ఇప్పుడు సవాల్గా మారింది. ప్రతి ప్రాజెక్ట్లో ప్రొడ్యూసర్ తన సొంత డబ్బుతోనే ముందుకు వస్తాడు. ఆ డబ్బు తిరిగి వస్తుందో లేదో అనేది పూర్తిగా అదృష్టం మీద ఆధారపడిపోయింది," అని చెప్పారు.
పాత తరం నిర్మాతల కాలంలో బయ్యర్స్ (డిస్ట్రిబ్యూటర్లు) బలంగా ఉండేవారని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ధీరజ్ అన్నారు. "ఇప్పుడు టాప్ టెన్ హీరోలకు మాత్రమే బయ్యర్స్ ఉన్నారు. మిగతా హీరోల సినిమాలకు మార్కెట్ లేదు. వాళ్లు తమ సినిమాలను సొంతంగా రిలీజ్ చేసుకోవాల్సిందే. ఒక సినిమా వర్కౌట్ అయినా, తర్వాతి సినిమా ఫ్లాప్ అయితే మొత్తం లాభం పోతుంది. కొన్నిసార్లు ముందటి సినిమాతో వచ్చిన ప్రాఫిట్ కంటే ఎక్కువ నష్టాలు కూడా వస్తాయి," అని వివరించారు.
"సినిమా బాగుండటం సరిపోదు, దాన్ని ప్రేక్షకుల దగ్గరికి ఎలా తీసుకెళ్తామన్నది ముఖ్యం. నటీనటులు కూడా ప్రమోషన్లలో భాగం కావాలి. కొత్తగా ఆలోచించి, కొత్తగా ప్రయత్నించడమే సినిమా విజయానికి మూలం" అని అన్నారు. ప్రస్తుతం ధీరజ్ మొగిలినేని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.


Click it and Unblock the Notifications











