వీరమల్లు రిలీజ్ వెనుక పంచాయతీ .. సక్సెస్మీట్లో పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 24న విడుదలైన ఈ పీరియాడిక్ మూవీ పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
నా జీవితం వడ్డించిన విస్తరి కాదు
'కేబినెట్ మీటింగ్ కారణంగా ఈవెంట్కు రావడం ఆలస్యమైందని ఇందుకు క్షమించాలి. సక్సెస్మీట్లు, ఫిలిం ప్రమోషన్స్ నాకు అలవాటు లేవు. ఉదయం కేబినెట్ మీటింగ్లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉంటూ పంచాయతీల వరకే పరిమితం అనుకున్నా కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి రిలీజ్ చేయాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నా లైఫ్లో నాకు ఏది తేలికగా దొరకలేదు. చిన్నపాటి అచీవ్మెంట్ కానీ, నేర్చుకోవడం కానీ వడ్డించిన విస్తరి కాదు. కిందపడి, నలిగి సాధించుకున్నదే' అని పవన్ కళ్యాన్ వ్యాఖ్యానించారు.

డిప్యూటీ సీఎం అయినా సినిమా రిలీజ్ చేసుకోలేకపోయా
'డిప్యూటీ సీఎం అయ్యాం కదా.. చిటికెలో సినిమాలు రిలీజ్ కావాలి కదా. ఎన్ని ఇబ్బందులు పడాలి? ఎన్ని పంచాయతీలు చేయాలి? నాకు అలసట వచ్చేస్తుంది. గత వారం రోజులుగా సరిగా నిద్రలేదు.. 30 ఏళ్ల నా సినీ ప్రయాణంలో ఈ సినిమా గురించి మాట్లాడిన దానిలో 10 శాతం కూడా మాట్లాడి ఉండను. ఎవరితో మాట్లాడకూడదు.. ఒంటరిగా ఉందాం అనుకున్న టైంలో పబ్లిక్ లైఫ్లోకి వచ్చాను. సక్సెస్లకు అతీతంగా ఉండాలి అనుకుంటే భగవంతుడు నా సినిమాను నేనే ప్రమోట్ చేసే పరిస్ధితికి తీసుకొచ్చాడు. సినిమా సక్సెస్లు, రికార్డులు ఇవన్నీ నాకు తెలియదు.. తలకెక్కలేదు, తలకెక్కించుకోను. మైత్రీ మూవీ మేకర్స్, టీజీ విశ్వప్రసాద్ లేకుంటే వీరమల్లు రిలీజ్ అయ్యేది కాదు' అని పవన్ కళ్యాణ్ కుండబద్ధలు కొట్టారు.
జిజియా పన్ను గురించే చర్చ
'పీరియాడికల్ మూవీ నాకెప్పుడూ డౌటే. అది ఎలా చేయగలం, ఎలా సాధించగలం అంటే టాలెంటెడ్ టెక్నీషియన్స్ నాకు దొరికారు. చిన్నప్పటి నుంచి అక్బర్, షాజహాన్, ఔరంగజేబుల గురించి చదువుకుంటూనే ఉన్నాం. హిందువుగా ఉండాలంటే జిజియా పన్ను కట్టాలని చిన్న లైన్ ఉండేది.. ఈ సినిమా చూస్తున్నప్పుడే ఈ పన్ను గురించి డిస్కష్ చేశాం. సినిమా నిడివి నాలుగున్నర గంటలు రావడంతో రెండు పార్ట్లుగా విభజించాం. తిప్పికొడితే మొఘలులు 200 సంవత్సరాలకు మించి పాలించలేదు.. మరి పల్లవులు, చాళుక్యులు, పాండియన్లు, విజయనగర సామ్రాజ్యం వందల ఏళ్లు పాలించింది' అని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు.
భయపడే రకం కాదు
'ఔరంగజేబు చనిపోయి శతాబ్ధాలు దాటినా.. ఆయన గురించి మాట్లాడటానికి భయపడుతున్నారు. మొఘలులు చేసిన మంచితో పాటు వాళ్ల దుర్మార్గాలు కూడా చెప్పాల్సి ఉంది. ఔరంగజేబు గురించి మాట్లాడినందుకు కొందరికి కోపం వచ్చిందని, ఇంకొందరైతే నా సినిమాలు ఆడనివ్వమని బాయ్కాట్ చేస్తామని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మీరు ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి.. మేం భయపడే రకం కాదు. నెల్లూరులో చిన్న ప్రభుత్వోద్యోగి ఇంట్లో పుట్టినవాడిని ఎన్నో ఎదురుదెబ్బలు తిని ఇక్కడి దాకా వచ్చా. సినిమా అనేది సమాజంపై చూపించే ప్రభావం అంతా ఇంతా కాదు.. శంకరాభరణం చూసిన తర్వాత నాకు కర్ణాటక సంగీతంపై ఇష్టం పెరిగింది' అని పవన్ చెప్పారు.
నెగిటివిటీని తిరిగి కొట్టండి
'సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్కి ఎలా రిప్లయ్ ఇవ్వాలా అని నలిగిపోవద్దు.. ఎలా తిరిగి కొట్టాలా అని ఆలోచించండి. నెగిటివ్ ఉంటే కొట్టి నమిలేయండి. చరిత్రలో గొప్పవారిగా కీర్తించబడిన వారు చెత్త పనులు కూడా చేశారని చెప్పాలన్నదే నా లక్ష్యం. పాన్ ఇండియా సినిమా చేసిన నిర్మాతకు అండగా నిలబడటం నా బాధ్యత. 2019లో నేను ఓడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత అవమానంగా ఉంటాడో చూడాలని అనుకున్నారు. చిన్న ఊరిలో పెరిగినవాడు హీరో అయ్యాడు, తర్వాత పార్టీ పెట్టాం, ఓడిపోవడమే పెద్ద సక్సెస్ అనిపిస్తుంది. అడుగు ముందుకొస్తేనే కదా డిప్యూటీ సీఎంగా మీ ముందుకొచ్చా. సోషల్ మీడియాను కరెక్ట్గా వాడుకోవాలి కానీ.. భాష గురించి, ప్రాంతం గురించి కొట్టుకోవద్దు' అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.


Click it and Unblock the Notifications











