Pawan Kalyan: హరీష్ శంకర్ ఊహించని ట్వీట్.. ఆ పాత పాటతో సర్ప్రైజ్
సినిమాల్లోకి కమ్బ్యాక్ అయిన తర్వాత నుంచి గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంతో కనిపిస్తూ.. వరుసగా సినిమాల మీద సినిమాలను లైన్లో పెట్టుకుంటూ దూసుకుపోతోన్నాడు టాలీవుడ్ బడా హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పుడు చేతిలో నాలుగైదు ప్రాజెక్టులను పెట్టుకున్న ఈ మెగా హీరో.. ఒకదాని తర్వాత ఒకటి షూటింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు పవర్ స్టార్.. తనకు గతంలో 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ను అందించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా చేస్తున్నాడు. దీంతో ఆ కాంబోపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.
నిజానికి పవన్ కల్యాణ్.. హరీష్ శంకర్తో కలిసి 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమాను చాలా ఏళ్ల క్రితమే ప్రకటించాడు. కానీ, ఈ మూవీని మాత్రం అనుకున్న సమయానికి ప్రారంభించలేదు. దీంతో ఈ ప్రాజెక్టును ఆపేశారని ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఈ సినిమాను 'ఉస్తాద్ భగత్ సింగ్' పేరుతో చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు, ఆరోజే పూజా కార్యక్రమాలను కూడా జరిపి పుకార్లకు పుల్స్టాప్ పెట్టారు. అప్పటి నుంచి ఇది ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్.
భారీ సక్సెస్ తర్వాత పవన్ - హరీష్ కాంబోలో రూపొందుతోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ షూటింగ్ ఏప్రిల్ 5వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ తన ట్విట్టర్ ఖాతాలో 'మంచి మిత్రులు' సినిమాలోని 'ఎన్నాళ్లో వేచిన హృదయం' అనే పాటను షేర్ చేశాడు. అంతేకాదు, 'అది ఈరోజే' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. దీనికి కింద ఉస్తాద్ భగత్ సింగ్ ట్యాగ్ను జోడించాడు. దీంతో ఈ సినిమాను నేటి నుంచి ప్రారంభించినట్లు హరీష్ వెల్లడించాడు. ఈ షడన్ సర్ప్రైజ్కు పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది 'తేరీ' మూవీకి రీమేక్గా రాబోతున్నట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది.


Click it and Unblock the Notifications











