అల్లు అర్జున్తో వస్తాడనుకుంటే... లింగుస్వామికి ఇలా సెట్టైంది!
తమిళ దర్శకుడు లింగు స్వామి త్వరలో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారని, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో సినిమా చేయబోతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. బన్నీ కూడా ఇతర ప్రాజెక్టులతో బిజీ కావడంతో వీరి కాంబినేషన్లో సినిమా ఉండక పోవచ్చనే వార్తలు తెరపైకి వచ్చాయి.
తాజాగా లింగు స్వామి మరో తెలుగు హీరోతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు అఫీషియల్ ప్రకటన వెలువడింది. తెలుగు హీరో హవీష్తో లింగు స్వామి సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో ఒకేసారి షూట్ చేస్తారట. ఆగస్టు నుంచి ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది.

2012లో 'జీనియస్' సినిమా ద్వారా హీరోగా కెరీర్ మొదలు పెట్టిన హవీస్ పలు తెలుగు చిత్రాల్లో నటించాడు. ఆయన నటించిన చివరి చిత్రం 'సెవెన్' ఇటీవల విడుదలైంది. హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్, రమేష్ వర్మ ప్రొడక్షన్స్ బేనర్లో రమేష్ వర్మ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రంలో రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలుగా నటించారు.
ఇక లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చివరి చిత్రం విశాల్ హీరోగా రూపొందిన 'పందెం కోడి 2'. ఆయన దర్శకత్వం వహించిన 'ఇదం పోరుల్ ఇవల్' షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. హవీష్తో నెక్ట్స్ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications











