చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్.. ఒక్క సాక్ష్యం లేక.. ఆ హీరోలపై 35 కేసులు క్లోజ్
సినీ పరిశ్రమలో వెలిగిపోదామని ఎన్నో కలలతో, ఆశలతో వచ్చే అమ్మాయిలను అవకాశాలు ఇస్తామని ట్రాప్ చేసే గ్యాంగ్లు టాలీవుడ్ టూ బాలీవుడ్ హల్చల్ చేస్తుంటాయి. స్వయంగా హీరోలు, దర్శకులు, నిర్మాతలు సహా కొందరు ప్రముఖులు తమను కమిట్మెంట్ అడిగినట్లు పలువురు హీరోయిన్లు, నటీమణులు వాపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్యాస్టింగ్ కౌచ్కి సంబంధించి కేరళలో నియమించిన సిట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..
భావనపై వేధింపులతో ఉలిక్కిపడ్డ ఇండస్ట్రీ
8 ఏళ్ల క్రితం 2017లో మలయాళ నటి భావన మీనన్ను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మాలీవుడ్తో పాటు ఏకంగా భారతీయ చిత్ర పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. ఈ కిడ్నాప్, లైంగిక వేధింపులకు ప్రధాన సూత్రధారిగా మలయాళ స్టార్ హీరో దిలీప్ పేరు బయటకు రావడం మరింత కలకలం రేపింది. మహిళా సంఘాలు, పౌర హక్కుల నేతలు, మీడియా ఒత్తిడితో నాటి కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్పై అధ్యయనం చేసేందుకు జస్టిస్ హేమా కమిటీని నియమించింది.

ఆ 15 మంది చేతుల్లో ఇండస్ట్రీ
దాదాపు రెండేళ్ల పాటు ఎంతో శ్రమించి హీరోయిన్లు, నటీమణుల స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన కమిటీ పలు సంచలన విషయాలను వెలికి తీసింది. ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు ఈ నివేదిక బయటికి రాకుండా అడ్డుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ దాదాపు 295 పేజీల నివేదికను రూపొందించిన కమిటీ .. అత్యంత సున్నితమైన అంశాలు ఉన్న 63 పేజీలను మినహాయించి మిగిలిన నివేదికను బహిర్గతం చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు హీరోలు, దర్శకులు, నిర్మాతలు కలిపి ఓ 15 మంది ఇండస్ట్రీని శాసిస్తున్నారని హేమా కమిటీ పేర్కొంది.
చిత్రసీమను కుదిపేసిన హేమ కమిటీ
వీరు చెప్పినట్లుగా ఇండస్ట్రీలో చిన్నా, పెద్దా నడుస్తున్నారని.. వీరికి ఎదురు తిరిగిన వారి జీవితాలు నాశనమైపోయాయని కమిటీ వెల్లడించింది. అమ్మాయిలు కమిట్మెంట్కు సిద్ధం కావాల్సిందేనని, లొంగకపోతే సెట్లో రీషూట్ల పేరుతో హింసించేవారని కొందరు నటీమణులు చెప్పినట్లు కమిటీ వెల్లడించింది. ఈ నివేదిక వెలుగులోకి రావడంతో హేమా కమిటీ వంటిది తమకు కావాలని తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలకు చెందిన నటీమణులు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA)కు సూపర్స్టార్ మోహన్లాల్తో పాటు పలువురు ప్రముఖులు రాజీనామా చేశారు.
ముందుకు రాని బాధితులు
హేమ కమిటీ రిపోర్ట్తో ప్రభుత్వంపై విమర్శలు రావడంతో పాటు దాదాపు 35 కేసులు నమోదవ్వగా వీటిని దర్యాప్తు చేసేందుకు కేరళ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. అయితే తాజాగా ఈ కేసులన్నింటినీ మూసివేస్తున్నట్లు కేరళ హైకోర్టుకు సిట్ తెలియజేసింది. ఈ కేసుల విచారణలో సాక్ష్యం చెప్పేందుకు బాధితులు, సాక్షులు ముందుకు రావడం లేదని అందుకే వాటిని మూసివేస్తున్నట్లు న్యాయస్థానానికి తెలిపింది. దీనిపై స్పందించిన కోర్ట్.. ప్రస్తుతానికి ఈ కేసులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, వాటిని మూసివేయాల్సిందిగా ఆదేశించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం చిత్ర సీమలో హాట్ టాపిక్గా మారగా.. హీరోలను ఎదిరించే దమ్ము ఎవరికీ లేదంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











