రాంచరణ్ చేతికి ఖరీదైన కారు.. హైదరాబాద్లో ఏకైక ఓనర్గా రికార్డు.. ఎన్ని కోట్ల ధరనో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చారు రామ్ చరణ్ తేజ్. డ్యాన్సులు, ఫైట్లు, నటనలో తండ్రికి తగ్గ తనయుడినని నిరూపించుకోవడానికి ఆయనకు పెద్దగా టైం పట్టలేదు. అలా అని తొలినాళ్లలో కెరీర్ సాఫీగా సాగిపోయిందని కాదు. నటన, లుక్స్ పరంగా ఎందరో విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ తట్టుకుని నిలబడ్డారు చరణ్. చిరుతతో మంచి మార్కులు వేయించుకున్న ఆయన మగధీరతో ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకున్నారు.. కానీ ఆ తర్వాత ఆ రేంజ్లో హిట్స్ పడలేదు.
ఇలాంటి దశలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా చరణ్లోని పరిపూర్ణమైన నటుడిని బయటకు తీసుకొచ్చింది. చెవిటివాడుగా, నిరక్ష్యరాస్యుడిగా డీగ్లామర్ రోల్లో ఆయన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చరణ్ తప్పించి ఈ పాత్రలో మరొకరిని ఊహించుకోలేమన్నంతగా ఆయన చిట్టిబాబు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. మధ్యలో వినయ విధేయ రామ నిరాశపరిచినా .. తిరిగి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్తో కలిసి చేసిన మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్.. రికార్డులను తిరిగరాసింది. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన ఈ మూవీతో చరణ్ రేంజ్ ఎక్కడితో వెళ్లిపోయింది. ఆర్ఆర్ఆర్ తర్వాతి నుంచి చరణ్ను అభిమానులు గ్లోబల్ స్టార్ అని పిలుస్తున్నారు.

ప్రస్తుతం తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు చరణ్. ఈ మూవీపై టాలీవుడ్తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. సినిమాలతో పాటు పలు వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు రామ్ చరణ్. ఆయనకు సొంతంగా ఎయిర్లైన్స్ సంస్థ ఉంది. అలాగే చరణ్కు లగ్జరీ కార్లపై మక్కువ ఎక్కువ. మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చినా వెంటనే బుక్ చేసేయాల్సిందే. ఇప్పటికే ఆయన గ్యారేజ్లో ఎన్నో విలాసవంతమైన కార్లు ఉన్నాయి. తాజాగా చరణ్ మరో లగ్జరీ కారును కొన్నారు. అది అలాంటి ఇలాంటిది కాదు.. రోల్స్ రాయిస్ కారు. ఈ కంపెనీ ఇటీవల రిలీజ్ చేసిన 'రోల్స్ రాయిస్ స్పెక్ట్రా' కారును ఆయన కొనుగోలు చేశారు. దాని ధర అక్షరాల ఏడున్నర కోట్లు.. ఇక ఆన్ రోడ్ ప్రైస్ ఇంకాస్త ఎక్కువే ఉంటుందని నిపుణులు అంటున్నారు.
అంతేకాదు.. ఈ రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కారు ఇండియాలో రెండోది కాగా, హైదరాబాద్లో ఫస్ట్ కస్టమర్ రామ్ చరణ్ కావడం విశేషం. బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో పాల్గొనడానికి గాను చరణ్ దంపతులు ముంబై చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో ఈ రోల్స్ రాయిస్ స్పెక్ట్రా కారులో చరణ్ , ఉపాసన కనిపించారు. చరణ్ స్వయంగా ఈ కారును డ్రైవ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కారు ధర అక్షరాల 7.5 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అయితే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చరణ్ అంతటి వ్యక్తి ఈ కారును కొనుగోలు చేశారంటే అందులో ఏదో ఒక స్పెషాలిటీ ఉండి తీరుతుంది.. పైగా రోల్స్ రాయిస్ కారు. ఈ స్పెక్ట్రా మోడల్ .. ఎలక్ట్రిక్ కారుగా తెలుస్తోంది. ఈ కారును పూర్తిగా అల్యూమినియం స్పేస్ ఫ్రేమ్తో తయారుచేశారు. స్ప్లిట్ హెడ్ ల్యాంప్.. హెడ్లైట్స్ పైన ఆల్ట్రా స్లిమ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ను ఇందులో అమర్చారు. అలాగే 22 ఎల్ఈడీ బల్పులతో పాంథియన్ గ్రిల్ను రూపొందించారు. చీకటిలో ఇది అదిరిపోతుందని ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. 23 అంగుళాల వీల్స్ను ఈ కారుకు అమర్చారు.
575 బీహెచ్పీ పవర్ ఇంజిన్తో 900 ఎన్ఎం టార్క్ను స్పెక్ట్రా రిలీజ్ చేస్తుంది. కేవలం 4.4 సెకన్లలోనే అలవోకగా 100 కిలోమీటర్ల స్పీడును అందుకుంటుందట. ఈ కారులో 102 కిలోవాట్ల బ్యాటరీని అమర్చారు. ఫుల్ ఛార్జ్తో ఏకంగా 521 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చట. భారతదేశంలో చెన్నైకి చెందిన ఓ వ్యక్తి రోల్స్ రాయిస్ స్పెక్ట్రాను కొనుగోలు చేసిన తొలి కస్టమర్. ఆ తర్వాతి వ్యక్తి రామ్ చరణ్ కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











