అమ్మో ఆ థియేటర్కా.. అల్లు అర్జున్ కేసుపై సందీప్ కిషన్ ఇన్డైరెక్ట్ కామెంట్స్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 1850 కోట్లకు పైగా కలెక్షన్స్తో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది పుష్ప 2. ఈ సినిమా రికార్డులతో పాటు ఎన్నో వివాదాల్లోనూ ఇరుక్కున్న సంగతి తెలిసిందే.
పుష్ప 2 విడుదలకు ముందు రోజు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్లో ఈ సినిమా స్పెషల్ షోను ప్రదర్శించారు. తన కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి ఈ సినిమా చూసేందుకు అల్లు అర్జున్ సంథ్య థియేటర్ వద్దకు వచ్చారు. అయితే ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే వివాహిత స్పాట్లోనే ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి , ఆసుపత్రిలో నిన్న మొన్నటి వరకు మృత్యువుతో పోరాడాడు.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు సంథ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్ తదితరులపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం తెలుగు నాట కలకలం రేపింది. అనంతరం పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. అయితే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా విమర్శలు గుప్పించారు.
ఆ వెంటనే అల్లు అర్జున్ కూడా ప్రెస్మీట్ పెట్టి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో తొక్కిసలాటకు ముందు, తర్వాత ఏం జరిగిందో పోలీసులు వీడియో విడుదల చేశారు. సంథ్య థియేటర్ తొక్కిసలాట తర్వాత తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు తెలంగాణలో ఏ సినిమాకు స్పెషల్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. దీంతో ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు సినీ ప్రముఖులు రంగంలోకి దిగారు.

అయితే రోజులు గడుస్తున్నా సంథ్య థియేటర్ వ్యవహారం ఇంకా చిత్ర సీమలో కలకలం రేపుతూనే ఉంది. తాజాగా అల్లు అర్జున్ కేసుపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు యువ హీరో సందీప్ కిషన్. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా - రీతూ వర్మ హీరోయిన్గా తెరకెక్కిన మజాకా చిత్రం శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.
సినిమాకు దక్కుతోన్న ఆదరణ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్లో సక్సెస్మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. మా సినిమాకు మంచి స్పందన వస్తోందన్నారు. మజాకాకు థియేటర్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దామని తాను సింగిల్ స్క్రీన్ థియేటర్లకు వెళ్తానంటే మా వాళ్లు వద్దు అన్నారని సందీప్ చెప్పారు. హీరో అక్కడికి వెళ్లాలంటే పోలీస్ పర్మిషన్లు చాలా ఉంటాయని తనను భయపెట్టారని.. దీంతో మల్టీప్లెక్స్లకు వెళ్లి చూడగా జనం పగలబడి నవ్వుతున్నారని ఆయన తెలిపారు. సందీప్ కిషన్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇవి పరోక్షంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట , పోలీస్ అనుమతుల గురించేనంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











