టాలీవుడ్ హీరో వేణు ఇంట్లో తీవ్ర విషాదం.. పెద్ద దిక్కును కోల్పోయిన నటుడు
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది హీరోలుగా వస్తుంటారు. కానీ, వారిలో కొందరు మాత్రమే ప్రత్యేకతను చాటుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ హీరో వేణు తొట్టెంపూడి ఒకరు. టాలీవుడ్లో కామెడీ, ఫ్యామిలీ, ప్రేమకథా చిత్రాలతో సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకులను అలరించిన అతడు.. ఈ మధ్య కాలంలో పెద్దగా వెండితెరపై కనిపించడం లేదు. కానీ, ఇప్పుడు మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుని వరుస ప్రాజెక్టులతో వస్తున్నాడు. ఇంతలోనే వేణు కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
టాలీవుడ్ హీరో వేణు తొట్టెంపూడి తండ్రి వెంకట సుబ్బారావు (92) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయనకు వృద్దాప్యానికి సంబంధించిన కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యులు చికిత్సను అందించారు. ఈ క్రమంలోనే మరోసారి ఆయన ఆరోగ్యం క్షిణించింది. దీంతో ఈరోజు తెల్లవారుజాున ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు.

తొట్టెంపూడి వెంకట సుబ్బారావు మరణ వార్తను తెలుసుకున్న సినీ ప్రముఖులు, వేణు అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. అలాగే, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. వేణు తండ్రి భౌతికాయాన్ని సందర్శనార్ధం ఈరోజు మధ్యాహ్నం 12.00 గంటల వరకూ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని స్టీల్ & మైన్స్ కాంప్లెక్స్లో ఉన్న స్వగృహంలో ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత అంటే 12.30 గంటలకు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించబోతున్నారు.
ఇదిలా ఉండగా.. 2013లో వచ్చిన 'రామాచారి' చిత్రం తర్వాత సినీ రంగానికి దూరం అయిన తొట్టెంపూడి వేణు.. రవితేజ హీరోగా నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. అలాగే, గత ఏడాది 'అతిథి' అనే వెబ్ సిరీస్లోనూ నటించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరికొన్ని ప్రాజెక్టులను కూడా లైన్లో పెట్టుకుని ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.


Click it and Unblock the Notifications











