Adah Sharma: నక్సలైట్గా ఆదా శర్మ,. ఏ సినిమా కోసమంటే?
సంచలనం సృష్టించిన కేరళ స్టోరీ మూవీలో తన నటనతో అదరగొట్టింది ముంబై బ్యూటీ ఆదా శర్మ. ఈ మూవీతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపుతో పాటు క్రేజ్ కూడా సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. కేరళ స్టోరీ వివాదం కావడంతో ఈ సినిమాను మొదట విడుదల కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఎట్టకేలకు ఈ చిత్రం విడుదలై హిట్టు అందుకుంది. ఈ మూవీలో ఆదా శర్మ తన నటనతో అదరగొట్టిందనే చెప్పాలి.
ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో నితిన్ కాంబోలో వచ్చిన హార్ట్ ఎటాక్ మూవీ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో తన గ్లామర్ తో, తన నటనతో సినీ అభిమానులను ఆకట్టుకుంది. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్ చేసింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం, క్షణం లాంటి సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ సినిమాలేవీ పెద్దగా ఆడకపోవడంతో క్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి. పలు కన్నడ సినిమాల్లోనూ ఈ ముంబయి ముద్దుగమ్మ నటించింది. కానీ అక్కడ కూడా తన సినిమాలు ఏవీ పెద్దగా ఆడకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి. ముంబైకి మకాం మార్చేసి అక్కడే సినిమా ప్రయత్నాలు సాగించింది.

సినిమాలకు దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా సినీ అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు, తన ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంది ఆదా శర్మ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. ఇన్స్టాతో కుర్రకారుకు కూడా దగ్గరైంది. ఆ సమయంలో కేరళ స్టోరీ మూవీలో కీలక పాత్రలో నటించే అవకాశం రావడంతో ఇరగదీసి నటించేసింది. షాలిని పాత్రలో నటించింది అనడం కంటే జీవించింది అనే చెప్పాలి.
మతం మార్చుకుని అరబ్ దేశాలకు తరలించబడే అమ్మాయిగా షాలిని పాత్రలో ఆదా శర్మ ఒదిగిపోయింది. కేరళ స్టోరీ చుట్టూ వివాదాలు, విమర్శలు చుట్టు ముట్టినా.. ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను బాగానే ఆదరించారు. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో నటనతో ఆదా శర్మ.. దేశవ్యాప్తంగా గుర్తింపు అందుకుంది. వివాదాల మధ్య రిలీజైన ఈ మూవీని కేవలం రూ. 30 కోట్లతో తెరకెక్కించగా.. ఏకంగా రూ. 300 కోట్లు వసూళు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

కేరళ స్టోరీ మూవీలో నటించినందుకు ఆదా శర్మపై విమర్శలు చాలానే వచ్చాయి. వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమాను వ్యతిరేకించినవారు ఆదా శర్మపై కూడా అదే రేంజ్ లో వ్యతిరేకత వ్యక్తం చేశారు. వీటిపై స్పందించిన ఈ ముంబై బ్యూటీ.. కేరళ స్టోరీ ఎవరినీ ఇబ్బంది పెట్టాలని చేయలేదని, వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాలనే ఈ సినిమా చేసినట్లు వివరించింది.
కేరళ స్టోరీ ఎన్నో వివాదాలకు దారి తీసినప్పటికీ.. ఆదా శర్మ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మరోసారి అలాంటి సాహసోపేత కథాంశాన్నే ఎంచుకుంది. కేరళ స్టోరీ మేకర్సే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బస్తర్ అనే సినిమాను ఆదా శర్మ ఓకే చేసింది. బస్తర్.. ది నక్సల్స్ స్టోరీ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాను కూడా దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కిస్తున్నారు. దీనికి అమృత్ పాల్ షా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బస్తర్ మూవీలో ఆదా శర్మ మావోయిస్టు లీడర్ గా కనిపించబోతోంది. ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభం కాగా, అందుకు సంబంధించిన పోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.


Click it and Unblock the Notifications











