RGV: వర్మ 'వ్యూహం'కు మరో షాక్... ఇంతకీ సినిమా విడుదలపై హైకోర్టు ఏం చెప్పిందంటే?
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వ్యూహం సినిమా అనేక సార్లు వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విషయంలో మరొకసారి రాంగోపాల్ వర్మకి హైకోర్టులో షాక్ తగిలింది. అసలు ఏం జరిగింది? ఇంతకీ సినిమా విడుదల ఉందా లేదా అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఒకప్పుడు ట్రెండ్ సెట్టింగ్స్ సినిమాలు డైరెక్ట్ చేసిన వర్మ ఇప్పుడు మాత్రం కేవలం వివాదాస్పద సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రియల్ లైఫ్ స్టోరీలను ఆధారంగా చేసుకుని ఆయన ఇప్పటికీ అనేక సినిమాల డైరెక్ట్ చేశారు. ఇప్పుడు అదే కోవలో వ్యూహం అనే సినిమా కూడా సిద్ధం చేశారు. కానీ ఆ సినిమా పలు వివాదాలకు దారి తీస్తుంది.

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి... ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు... ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా పాదయాత్ర మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు.. అనేది స్టోరీ లైన్ గా చేసుకుని వ్యూహం అనే సినిమా డైరెక్ట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. అయితే ఇందులో తెలుగుదేశం పార్టీని తమను కించపరిచే విధంగా చూపించి ఉంటారని ఉద్దేశంతో నారా లోకేష్ సహా తెలుగుదేశం పార్టీ నేతలు ముందు నుంచి ఈ సినిమాకి ఏదో ఒక విధంగా అడ్డుపడుతూనే ఉన్నారు.
సెన్సార్ సభ్యులు.. సెన్సార్ మేము చేయలేము అని చెబితే సెంట్రల్ సెన్సార్ బోర్డు వరకు వెళ్లి రివిజన్ పిటిషన్ వేసి మరి సెన్సార్ పూర్తి చేసుకుంది. ఇక వ్యూహం సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకుని డిసెంబర్ 29వ తేదీన సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. అయితే ఆ సినిమాకు అనూహ్యంగా హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ సినిమాని జనవరి 11వ తేదీ వరకు రిలీజ్ చేయకూడదని స్టే విధించింది. రామ్ గోపాల్ వర్మ తెచ్చుకున్న సెన్సార్ సర్టిఫికెట్ మీద ఈ స్టే విధించింది న్యాయ స్థానం.

ఇక ఇప్పుడు వ్యూహం సినిమాపై హైకోర్టులో విచారణ చేపట్టారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది సినిమా యూనిట్. సినిమా విడుదల ఆగిపోవడం వల్ల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని వాదనలు వినిపించారు. సినిమాకు సంబంధం లేని వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారని వాదనలు వినిపించారు.
ఈనెల 11 వరకు వ్యూహం సినిమా విడుదల నిలిపివేస్తూ కొద్ది రోజుల క్రితం సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈనెల 11 కు బదులు 8 వ తేదీన విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలని సినిమా యూనిట్ కోరింది. దీంతో మెరిట్స్ ఆధారంగా ఈనెల 8 న సినిమాపై నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జికి డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేస్తూ వ్యూహం సినిమా యూనిట్ వేసిన అప్పీల్ పిటిషన్ డిస్ పోస్ చేసింది హై కోర్ట్. చూడాలి మరి మున్ముందు ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











