టాలీవుడ్లో భారీ పైరసీ స్కామ్.. రిలీజ్ రోజే ఆన్లైన్లోకి 65 సినిమాలు, ఆ థియేటర్లోనే కుట్ర
ఏ వ్యాపారాన్ని అయినా దెబ్బతీసేందుకు కొందరు శత్రువులు రెడీగా ఉంటారు. అలాగే సినీ పరిశ్రమను దెబ్బతీస్తోన్న అంశాల్లో పైరసి ఒకటి. సినీ పరిశ్రమ, పోలీసులు, ప్రభుత్వం ఇతర విభాగాలు ఎంతగా కట్టడి చేస్తున్నా పైరసి భూతాన్ని అడ్డుకోలేకపోతున్నారు. గతంలో సినిమా రిలీజైన రోజే డీవీడీలు, వీసీడీల రూపంలో బజారులో దొరికేవి. డిజిటల్ యుగంలో సినిమా రిలీజ్ అయిన క్షణాల్లోనే ఆన్లైన్లో హెచ్డీ ప్రింట్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ప్రపంచంలోని ఏ దేశంలో నుంచైనా ఈ సినిమాలను స్ట్రీమింగ్ చేసే వెసులుబాటు ఉండటంతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.
పైరసీ వల్ల టాలీవుడ్కు 3700 కోట్ల నష్టం..
పైరసీ కారణంగా వేల కోట్లలో సినీ పరిశ్రమ నష్టపోతోంది. ఒక్క తెలుగు చిత్ర పరిశ్రమనే చూసుకుంటే 2024లో దాదాపు 3700 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఫిలిం ఛాంబర్ తెలిపింది. ఒక్క టాలీవుడ్లోనే ఈ పరిస్ధితి ఉంటే కోలీవుడ్, బాలీవుడ్ సహా మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమ ఏ స్థాయిలో నష్టాలను ఎదుర్కొంటుందో ఊహించుకోవడమే కష్టంగా ఉంది. పైరసీని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా కఠిన చట్టాలు ఉన్నా.. అమలుకు నోచుకోవడం లేదు. ఇటీవల టాలీవుడ్ నుంచి నిర్మాణమైన పుష్ప 2, కల్కి 2898 డీ, గేమ్ ఛేంజర్, సింగిల్, తండేల్, కన్నప్ప సహా ఈ లిస్ట్లో పైరసీ రక్కసికి బలైన సినిమాలెన్నో. పైరసీని కనుక కట్టడి చేయకుంటే భారతీయ డిజిటల్ పరిశ్రమ 2029 నాటికి 20 వేల కోట్లకు పైగా నష్టాలను ఎదుర్కొంటుందని నిపుణుల అంచనా.

పైరసీ గుట్టురట్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
పైరసీ గురించి చర్చ జరుగుతున్న సమయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు టాలీవుడ్లో బడా పైరసీ రాకెట్ గుట్టును రట్టు చేశారు. పైరసీకి పాల్పడుతూ వాటిని ఆన్లైన్లో విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పైరసీ రాకెట్, నిందితుడి అక్రమాలను హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్, సైబర్ క్రైమ్ డీసీపీ కవితలు మీడియాకు ఓ ప్రకటనలో వివరాలు తెలియజేశారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జాన కిరణ్ కుమార్గా గుర్తించారు. ఇతను హైదరాబాద్ నగరంలో నివసిస్తూ ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు.
డబ్బుతో కుర్రాళ్లకు పైరసీ ముఠాల ట్రాప్
ఇన్స్టాగ్రామ్లో ఓ పైరసీ గ్రూపు నిర్వాహకులతో పరిచయం ఏర్పడి.. సినిమాలు పైరసీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇతను షర్ట్ జేబులో హెచ్డీ కెమెరా పెట్టుకుని రిలీజ్ రోజే సినిమా థియేటర్కు ప్రేక్షకుడిలా వెళ్లి రికార్డ్ చేసేవాడు. ఆ తర్వాత సదరు వీడియోను టెలిగ్రామ్ ద్వారా పైరసీ వెబ్సైట్లకు చేరవేసేవాడు. ఇందుకుగాను ఒక్కో సినిమాకు 300 నుంచి 400 డాలర్ల చొప్పున క్రిప్టో కరెన్సీ రూపంలో స్వీకరించేవాడు. వీటిని పలు క్రిప్టో ఎక్చేంజ్ల ద్వారా కరెన్సీలోకి మార్చుకునేవాడని పోలీసులు తెలిపారు.
ఆ థియేటర్లోనే రికార్డింగ్
అయితే ఇటీవల విడుదలైన కొన్ని సినిమాల హెచ్డీ ప్రింట్లు ఆన్లైన్లో ప్రత్యక్షం కావడాన్ని గుర్తించిన ప్రొడక్షన్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. వెంటనే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లోని యాంటీ వీడియో పైరసీ సెల్ను ఆశ్రయించాయి. రంగంలోకి దిగిన సెల్ ప్రతినిధులు.. సినిమా స్క్రీనింగ్ జరిగేటప్పుడు తెరపై వచ్చే వాటర్మార్క్ ఆధారంగా హైదరాబాద్లోని ఓ థియేటర్లో సినిమాల రికార్డింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు. అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది పైరసీ సెల్. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆన్లైన్ టికెట్ బుకింగ్ల ఆధారంగా నలుగురిని గుర్తించగా, వారిలో కిరణ్ అసలు నిందితుడిగా తేల్చారు. ఇతను కేవలం సంవత్సరం వ్యవధిలోనే దాదాపు 40కి పైగా సినిమాలను పైరసీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇతనిని విచారిస్తే.. దీని వెనుక ఎవరున్నారు? ఎన్ని ముఠాలు చేతులు కలిపాయి తెలిసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











